Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వ ఉద్యోగాల‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

రాజ‌స్థాన్‌లో 2001-02 మ‌ధ్య ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్రంలో జ‌నాభా నియంత్ర‌ణ‌కు ప్రాధాన్యం ఇచ్చిం ది. అనేక రూపాల్లో ప్ర‌చారం చేసింది.

By:  Tupaki Desk   |   29 Feb 2024 2:27 PM GMT
ప్ర‌భుత్వ ఉద్యోగాల‌పై సుప్రీంకోర్టు  సంచ‌ల‌న తీర్పు
X

రాజ‌స్థాన్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు సంబంధించి అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన చ‌ట్టాన్ని సుప్రీం కోర్టు స‌మ‌ర్థించింది. ఉద్యోగాలు కోర‌కునే వారు ఇద్ద‌రికి మించి పిల్ల‌ల‌ను క‌లిగి ఉంటే.. వారికి ఉద్యోగాలు ఇవ్వ‌బోమ‌న్న ప్ర‌భుత్వ చ‌ట్టాన్ని సుప్రీం కోర్టు స‌మ‌ర్థించింది. దీంతో మాజీ సైనికుడికి ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్ట‌యింది. 2002లో తీసుకువ‌చ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ట్టాన్ని సుప్రంకోర్టు స‌మ‌ర్థించ‌డం గ‌మ‌నార్హం. దీంతో స‌ద‌రు వ్య‌క్తి వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు.

ఏం జ‌రిగింది?

రాజ‌స్థాన్‌లో 2001-02 మ‌ధ్య ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్రంలో జ‌నాభా నియంత్ర‌ణ‌కు ప్రాధాన్యం ఇచ్చిం ది. అనేక రూపాల్లో ప్ర‌చారం చేసింది. అయిన‌ప్ప‌టికీ.. జ‌నాభా పెరుగుద‌ల క‌ట్ట‌డి కాక‌పోవ‌డం.. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌కు కొరత ఏర్ప‌డ‌డంతో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇద్ద‌రు క‌న్నా ఎక్కువ పిల్ల‌ల‌ను క‌నే కుటుంబాల్లోని వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇచ్చేది లేదంటూ రాజస్థాన్‌ వేరియస్‌ సర్వీస్‌ రూల్స్‌ చట్టానికి 2001లో సవరణలు చేసింది. దీని ప్ర‌కారం.. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈ నిబంధన అమల్లో ఉంది.

తాజా కేసు ఏంటంటే..

రాజస్థాన్‌కు చెందిన రామ్‌జీ లాల్‌ జాట్ అనే వ్య‌క్తి భార‌త ఆర్మీలో పనిచేసి 2017లో రిటైర్ అయ్యాడు. త‌ర్వాత రాజ‌స్థాన్ హోం శాఖ వెలువ‌రించిన కానిస్టేబుల్‌ ఉద్యోగ నోటిఫికేష‌న్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుని.. అన్ని ప‌రీక్ష‌లు పాస‌య్యాడు. తీరా ఉద్యోగానికి ఎంపికైన త‌ర్వాత‌.. ఆయ‌న‌ను అన‌ర్హుడిగా పేర్కొంటూ.. అధికారులు ప‌క్క‌న పెట్టారు. రామ్‌జీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నార‌ని.. నిబంధ‌న‌లు అంగీక‌రించ‌వ‌ని తేల్చి చెప్పారు.

అధికారుల నిర్ణ‌యంపై రామ్‌జీ రాష్ట్ర హైకోర్టునుఆశ్ర‌యించ‌గా.. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న చ‌ట్టం ప్ర‌కారం ఈనిర్ణ‌యం స‌రైందేన‌ని తేల్చి చెప్పింది. ఇది విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను సమర్థించింది. అంతేకాదు.. ఈ చ‌ట్టంలో వివక్ష లేదని, కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో ప్ర‌భుత్వం ఈ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింద‌ని తెలిపింది. దీంతో రామ్ జీ పిటిష‌న్‌ను కొట్టి వేసింది.