Begin typing your search above and press return to search.

ఏపీ డిప్యూటీ కలెక్టర్ కు తహసీల్దార్ స్థాయికి డిమోట్ చేస్తూ సుప్రీం షాక్

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్.. జస్టిస్ ఏజీ మసీహ్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పును ఇచ్చింది.

By:  Tupaki Desk   |   10 May 2025 9:49 AM IST
ఏపీ డిప్యూటీ కలెక్టర్ కు తహసీల్దార్ స్థాయికి డిమోట్ చేస్తూ సుప్రీం షాక్
X

హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ కావటమే కాదు.. ఏపీ డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావుకు దిమ్మ తిరిగిపోయే షాకింగ్ ఆదేశాల్ని జారీ చేసింది. 2013లో తహసీల్దార్ గా పని చేస్తున్నప్పుడు గుంటూరు జిల్లాలోని అడవితక్కెళ్లపాడులో గుడిసెల్ని తొలగించటం కోర్టు ధిక్కరణ కింద పరిగణలోకి తీసుకొని షాకింగ్ శిక్ష వేసింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్.. జస్టిస్ ఏజీ మసీహ్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పును ఇచ్చింది. నిజానికి ఈ కేసుకు సంబంధించి హైకోర్టు రెండు నెలల జైలుశిక్ష విధించినప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు మించి జైల్లో ఉండే ఉద్యోగం పోయే అవకాశం ఉండటంతో.. అతడి కుటుంబం ఫ్యూచర్ ను పరిగణలోకి తీసుకొని అందుకు భిన్నమైన.. అంచనాలకు అందని రీతిలో శిక్ష వేశారు.

అసలేం జరిగిందంటే.. గుడిసెలను తొలగించాలన్న నిర్ణయాన్ని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు అడ్డుకుంటూ.. అలాంటి చర్యలు చేపట్టొదంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాల్ని పట్టించుకోకుండా గుడిసెల్ని తొలగించి.. అందులో ఉన్న వారిని రోడ్ల మీదకు తీసుకొచ్చారు. అప్పట్లో ఏపీ రాష్ట్ర విభజన ఉద్యమం జరుగుతున్నప్పుడు.. సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని.. అందువల్ల కొందరు రాత్రికి రాత్రి వేసుకున్న గుడిసెల్ని మాత్రమే తొలగించినట్లు చెప్పిన వాదనను పరిగణలోకి తీసుకోలేదు.

హైకోర్టు ఆదేశాల్ని పట్టించుకోకుండా గుడిసెల్ని తొలగించటం ద్వారా తీవ్రమైన నేరానికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు. ఆయనపై చర్యలకు హైకోర్టును ఆశ్రయించగా.. 2 నెలలు జైలు.. రూ.2 వేల జరిమానా విధిస్తూ 2015 మార్చి 27 తీర్పు ఇచ్చారు. దీంతో మోహన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని రక్షించటానికే తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు విన్నవించారు. అయితే.. ఈ వాదనను సుప్రీం పరిగణలోకి తీసుకోలేదు.

48 గంటలకు మించి జైల్లో ఉంటే ఉద్యోగం పోతుందని.. దాని కారణంగా పిటిషనర్ కుటుంబం రోడ్డున పడుతుందని.. పిల్లల చదువులు దెబ్బ తింటాయని మోహన్ రావు తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ వాదనపై స్పందించిన సుప్రీంకోర్టు.. ‘గుడిసెల్ని తొలగించి.. అందులో ఉంటున్న వారిని రోడ్డు మీదకు తోసేసినప్పుడు ఇవననీ ఆలోచించి ఉండాల్సింది. పిటిషనర్ ను జైలుకు పంపితే ఉద్యోగం పోతుంది. ఆయన మొండితనం.. నిర్లక్ష్య వైఖరితో కుటుంబ సభ్యులు జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల జైలుశిక్షపై ఆదార వైఖరిని తీసుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. అదే సమయంలో ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కాదన్న విషయాన్ని తాము స్పష్టం చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మోహన్ రావు కుటుంబ సభ్యుల భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వాలని అతడి తరఫు లాయర్ సుప్రీం కోర్టును కోరగా.. అందుకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. "హైకోర్టు విధించిన శిక్షను సవరించి.. డిప్యూటీ కలెక్టర్ పదవి నుంచి తహసీల్దార్ పోస్టుకు డిమోట్ చేయాని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. పేదల ఇళ్ల నిర్మాణం కోసం నాలుగు వారాల్లో రూ.లక్ష ఫైన్ చెల్లించి.. ఆ రసీదును కోర్టుకు సమర్పించాలి. తదుపరి ప్రమోషన్ల కోసం ఆయన సీనియార్టీని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి" అని సుప్రీం తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది.

నిజానికి గతంలోనే ఈ కేసు విషయంలో మోహన్ రావుకు తహసీల్దార్ స్థాయికి తగ్గించే ప్రతిపాదన చేయగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించని నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. విధి నిర్వహణలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించే అధికారులకు సుప్రీం తాజా తీర్పు చెక్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.