Begin typing your search above and press return to search.

జస్టిస్ ఫర్ వివేకా... సునీత పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ వైరల్!

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన అంశం సుమారు గత అదేళ్లుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 April 2024 9:10 AM GMT
జస్టిస్  ఫర్  వివేకా...  సునీత పవర్‌  పాయింట్‌  ప్రజంటేషన్‌  వైరల్!
X

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన అంశం సుమారు గత అదేళ్లుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పైగా గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల, సునీతలు అటు జగన్, ఇటు అవినాష్ పై ఈ కేసు నేపథ్యంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో తాజాగా వివేకా హత్య కేసుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సునీత! ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు!

అవును... తాజాగా హైదరాబాద్‌ లో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించిన సునీత... ఈ సందర్భంగా వివేకా హత్యకు సంబంధించిన పలు వివరాలతో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. హత్య జరిగిన రోజు రాత్రి, తర్వాత రోజు ఉదయం కాల్‌ డేటా తో పాటు గూగుల్‌ టేకౌట్‌, ఐపీడీఆర్‌ డేటా అని చెబుతూ సునీత కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా... ఇవి చూశాక వివేకాది గుండెపోటు అని ఎవరైనా అనుకుంటారా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో హత్యజరిగిన రోజు వివేకా ఇంటి సమీపంలో ఉమాశంకర్‌ రెడ్డి పరుగెడుతున్న దృశ్యాలు అంటూ కొన్ని దృశ్యాలను సునీత ప్రదర్శించారు. ఇదే క్రమంలో... హత్య జరిగిన తర్వాత ఒక న్యూస్ ఛానల్ లో వచ్చిన వార్తల క్లిప్పింగులు, వైసీపీ నేతల వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. ప్రజలకు నిజం తెలిసేందుకే వీటిని ప్రదర్శించినట్లు సునీత వివరించారు.

ఈ క్రమంలో... మొదటి ఛార్జిషీట్‌ లో సీబీఐ... ఏ1 గా ఎర్ర గంగిరెడ్డి, ఏ2 గా సునీల్‌ యాదవ్‌, ఏ3 గా ఉమాశంకర్‌ రెడ్డి, ఏ4 గా దస్తగిరి నిందితులుగా ఉన్నారని తెలిపిన సునీత... ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డితో ఎంపీ అవినాష్‌ రెడ్డికి పరిచయం ఉందని తెలిపారు! అదేవిధంగా... అవినాష్ తో సునీల్‌ యాదవ్‌ తమ్ముడు కిరణ్‌ యాదవ్‌ దిగిన ఫొటోలు ఉన్నాయని వెల్లడించారు!

ఇదే క్రమంలో... వివేకా దగ్గర పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి - ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌ రెడ్డి మధ్య ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయని తెలిపారు. ఇలా ఒకరితో ఒకరికి పరిచయాలున్నా కూడ్దా... వీళ్లెవరో తనకు తెలియదని అవినాష్ అంటున్నారని.. కానీ.. ఫొటోలు, కాల్ లిస్ట్ చూస్తే మాత్రం అతడితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోందని సునీత చెప్పుకొచ్చారు!

అదే విధంగా... హత్య జరుగుతున్న సమయంలో అవినాష్ - ఎర్ర గంగిరెడ్డి మధ్య ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయని సునీత అన్నారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన సునీత.. ఐదేళ్ల కింద తనది ఒంటరి పోరాటమే కానీ.. ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు తన పోరాటానికి మద్దతిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే వివేకా హత్యకు సంబంధించి తనకు తెలిసిన విషయాలు చెబుతున్నట్లు సునీత తెలిపారు!