Begin typing your search above and press return to search.

రాజ్యసభకు సుధామూర్తి నామినేట్‌.. మోదీ ప్లానేంటి?

మార్చి 8న మహిళా దినోత్సవం రోజున పురస్కరించుకుని ఆయన ఈ ప్రకటన వెలువరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

By:  Tupaki Desk   |   8 March 2024 9:54 AM GMT
రాజ్యసభకు సుధామూర్తి నామినేట్‌.. మోదీ ప్లానేంటి?
X

ప్రముఖ విద్యావేత్త, ప్రముఖ రచయిత్రి, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్‌ లో పోస్టు చేశారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున పురస్కరించుకుని ఆయన ఈ ప్రకటన వెలువరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి చేసిన విశేష కృషిపై ప్రధాని మోదీ పొగడ్తలు కురిపించారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారమన్నారు. ఈ రంగాల్లో ఆమె అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రధాని కొనియాడారు.

సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అవడం ‘నారీశక్తి’కి బలమైన నిదర్శనమని తెలిపారు. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ సుధామూర్తి అన్నారు. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలి అని ప్రధాని మోదీ కోరుకున్నారు.

కాగా 73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం ‘మూర్తి ట్రస్ట్‌’కు ఛైర్‌ పర్సన్‌ గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశవ్యాప్తంగా ఖ్యాతిగడించారు. ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ లో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి సుధామూర్తి విశేష కృషి జరుపుతున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం చేత పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు.

సుధామూర్తికి ఒక కుమార్తె అక్షత ఉన్నారు. అక్షత భర్త, సుధామూర్తి అల్లుడు అయిన రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రిగా ఉన్నారు. సుధామూర్తి ఇచ్చిన రూ.5 వేలతోనే తాను ఇన్ఫోసిస్‌ ను స్థాపించినట్టు ఆమె భర్త నారాయణమూర్తి పలుమార్లు చెప్పారు.

ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ కు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. సుధామూర్తి సొంత రాష్ట్రం కర్ణాటక.

విద్యావేత్తగా, రచయిత్రిగా, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకురాలిగా ఆమెకు ఉన్న విశేషమైన పేరు ప్రఖ్యాతులను, ముఖ్యంగా మహిళల్లో ఉన్న క్రేజును వాడుకునేందుకే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుధామూర్తి పేరును రాష్ట్రపతికి సూచించిందని అంటున్నారు.

మరోవైపు రాజ్యసభకు నామినేట్‌ కావడం పట్ల సుధామూర్తి తన సంతోషాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆమె థాయ్‌ లాండ్‌ పర్యటనలో ఉన్నారు. రాజ్యసభకు నామినేట్‌ అయిన విషయం తెలుసుకుని తనకు ఫోన్‌ చేసిన మీడియా ప్రతినిధితో మాట్లాడారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం డబుల్‌ సర్‌ప్రైజింగ్‌ గా ఉందన్నారు. చాలా ఆనందంగా ఉందని.. ఇందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని తెలిపారు. తాను ఏనాడూ పదవులు కోరుకోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం తనను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదన్నారు. అయితే, దేశానికి సేవ చేసేందుకు ఇదో కొత్త బాధ్యత అని విశ్వసిస్తున్నానని తెలిపారు.