Begin typing your search above and press return to search.

సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి.. ఏం జరగనుంది?

లిక్కర్ వ్యాపారానికి సంబంధించి అరబిందో నుంచి మిథున్ రెడ్డి రూ.100 కోట్లు అప్పుగా తీసుకున్నారని నిన్న విజయసాయిరెడ్డి వాంగ్మూలమిచ్చారు.

By:  Tupaki Desk   |   19 April 2025 6:34 AM
SIT Intensifies Liquor Scam Probe MP Mithun Reddy Under Questioning
X

లిక్కర్ స్కాం విచారణలో సిట్ దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే వైసీపీ మాజీ విజయసాయిరెడ్డి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ఈ రోజు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కాంలో సంబంధం ఉందన్న ఆరోపణలతో విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసులు జారీ చేయడంతో మిథున్ రెడ్డి తన న్యాయవాదితో విజయవాడ పోలీసు కమిషనరేట్ కు వచ్చారు. సిట్ కార్యాలయంలో మిథున్ రెడ్డిని స్పెషల్ టీం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

లిక్కర్ వ్యాపారానికి సంబంధించి అరబిందో నుంచి మిథున్ రెడ్డి రూ.100 కోట్లు అప్పుగా తీసుకున్నారని నిన్న విజయసాయిరెడ్డి వాంగ్మూలమిచ్చారు. దీంతో మిథున్ రెడ్డి విచారణ ఉత్కంఠ రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి. అంతేకాకుండా వైసీపీ సీనియర్ నేత, రాయలసీమలోని బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. దీంతో మిథున్ రెడ్డిని మద్యం స్కాంలో పిలిపించడం ఉత్కంఠ రేపుతోంది.

మద్యం స్కాం వెలుగు చూసిన తర్వాత అరెస్టు భయంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు రక్షణతో ఆయన అరెస్టు గండం నుంచి తప్పించుకున్నారు. అదేసమయంలో కోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు సహకరించాల్సివుందని అంటున్నారు. వేల కోట్ల రూపాయల స్కాంకు సంబంధించి మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా సిట్ కీలక ఆధారాలు సేకరించిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతవరకు మిథున్ రెడ్డిపై సిట్ ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలపై మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. దీనికి మిథున్ రెడ్డి ఎలాంటి సమాధానాలు చెబుతారనేది కూడా ఆసక్తి రేపుతోంది.

సిట్ విచారణ ఎంత సేపు జరుగుతోంది అన్నది కూడా ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇదే కేసుకు సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి పరారీతో ఆయన తండ్రి ఉపేంద్ర రెడ్డిని రెండు రోజులుగా సిట్ విచారించింది. రోజుకు 6 గంటల చొప్పున ఆయన ప్రశ్నించింది. కాగా, వైసీసీ మాజీ నేత విజయసాయిరెడ్డిని మాత్రం కేవలం రెండు గంటల్లోనే తిరిగి పంపారు. దీంతో మిథున్ రెడ్డిని ఎంతసేపు ప్రశ్నిస్తారు.. సాయంత్రం వరకు ఆయన విచారణ కొనసాగుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.