Begin typing your search above and press return to search.

సింహాచలం ప్రమాదంలో 8 మంది మృతి... అసలేం జరిగింది?

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది.

By:  Tupaki Desk   |   30 April 2025 4:41 AM
సింహాచలం ప్రమాదంలో 8 మంది మృతి... అసలేం జరిగింది?
X

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి! మృతులుల్లో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.

అవును... సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో... సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే మార్గంలో రూ.300 టిక్కెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది. అయితే.. గోడకు ఇరువైపులా ఇనుప ఫెన్సింగ్ ఉండటంతో పెను ప్రమాదమే తప్పిందని అంటున్నారు.

గొడ కూలిన సమయంలో రాళ్లు నేరుగా భక్తులపై పడకుండా ఆ ఫెన్సింగ్ అడ్డుకున్నట్లు చెబుతున్నారు. ఆ ఫెన్సింగ్ లేకపోతే మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని అంటున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఎన్.డీ.ఆర్.ఎఫ్. సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరోపక్క మృతులను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నారు.

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం!:

సింహాచలంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. భారీ వర్షాలతో గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతూ.. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా... మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

‘ఎక్స్’ వేదికగా స్పందించిన డిప్యూటీ సీఎం!:

సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని చెబుతూ.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

తీవ్ర ఆవేదనకు గురి చేసింది - లోకేష్:

సింహాచలం ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నారా లోకేష్.