Begin typing your search above and press return to search.

వరమాల వేసి ముద్దు పెట్టుకున్నాడని వరుడ్ని ఉతికేశారు

ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లోని ఒక పెద్దాయనకు ఇద్దరుకుమార్తెలు. వారి ఇద్దరికి ఒకే రోజున ఒకే వేదికలో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు.

By:  Tupaki Desk   |   24 May 2024 5:07 AM GMT
వరమాల వేసి ముద్దు పెట్టుకున్నాడని వరుడ్ని ఉతికేశారు
X

కాలం మారింది. అందుకు తగ్గట్లే అభిరుచులు మారుతున్నాయి. దశాబ్దాల క్రితం పెళ్లి వేళ.. కొత్త జంట మాట్లాడుకోవటానికి కూడా బిడియపడేవారు. అందరి ముందు విడివిడిగా.. కాస్తంత గంభీరంగా ఉండేవారు. అయితే.. రెండు దశాబ్దాల నుంచి ఆ సీన్ లో మార్పు వచ్చింది. పెళ్లికి ముందే ఇరువురు గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుకోవటం.. వారి మధ్య చనువు పెరగటంతో పెళ్లివేడుకల్లో ఇద్దరి మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన పదేళ్లలో పరిస్థితుల్లో మరింత మార్పు వచ్చింది.

ఓపెన్ గా కిస్ చేసుకోవటం అలవాటుగా మారింది. అయితే.. ఇదే తీరు తాజాగా వివాదంగా మారటమే కాదు.. పెళ్లి వేడుక రణరంగంగా మారింది. వరమాల వేసిన తర్వాత వధువును ముద్దుపెట్టుకున్న వరుడి మీద అమ్మాయికుటుంబ సభ్యులు దాడి చేయటం.. చితక్కొట్టిన విపరీత పరిణామం యూపీలో చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లోని ఒక పెద్దాయనకు ఇద్దరుకుమార్తెలు. వారి ఇద్దరికి ఒకే రోజున ఒకే వేదికలో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఒక కుమార్తె పెళ్లి కార్యక్రమం ముగిసింది. రెండో కుమార్తె పెళ్లి కార్యక్రమం మొదలైంది. పెళ్లి క్రతువులో భాగంగా పెళ్లి కుమార్తె మెడలో వరమాల వేసిన వరుడు.. ఆమెను బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు. అయితే.. పెళ్లి కొడుకు తీరు అమ్మాయి తరపు వారికి నచ్చలేదు.

దీంతో.. స్టేజ్ మీదకు వచ్చి వరుడ్ని చితక్కొట్టేయటం మొదలుపెట్టారు. దీంతో అబ్బాయి తరఫు వారు కూడా అమ్మాయి తరఫు వారి మీద దాడి చేశారు. దీంతో పెళ్లి వేడుక కాస్తా రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎంట్రీ ఇచ్చేసరికి.. ఇరు వర్గాలకు చెందిన ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తెకు ఇష్టం లేకున్నా పెళ్లి కొడుకు అందరి ముందు ముద్దాడినట్లుగా వధువు తరఫు వారు ఆరోపిస్తే.. తన కాబోయే భార్య ఇష్టంతోనే తాను ముద్దు పెట్టినట్లుగా వరుడు చెబుతున్నాడు. అయితే.. ఈ వ్యవహారంపై ఎలాంటి కంప్లైంట్ రాలేదు. కాకుంటే.. పెళ్లి వేడుకలో బహిరంగంగా కొట్టుకున్న ఉదంతంలో ఆరుగురి మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు.