Begin typing your search above and press return to search.

షర్మిల టీం @ నో డిపాజిట్స్...!

కానీ కాంగ్రెస్ మాత్రం ఏకంగా 114 మంది అసెంబ్లీ అభ్యర్ధులతో తొలి జాబితాను ఆర్భాటంగా రిలీజ్ చేసింది. అలాగే అయిదు ఎంపీ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించింది

By:  Tupaki Desk   |   2 April 2024 5:30 PM GMT
షర్మిల టీం @ నో డిపాజిట్స్...!
X

మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను ఏపీలో ప్రకటించింది. ఏపీ రాజకీయాల్లో చూస్తే చాలా పార్టీల కంటే నయంగా పెద్ద నంబర్ తోనే కాంగ్రెస్ తన లిస్ట్ ని రిలీజ్ చేసింది జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ ఏపీలో పది అసెంబ్లీ సీట్లకే పోటీ చేస్తోంది. అది కూడా పొత్తులో.

కానీ కాంగ్రెస్ మాత్రం ఏకంగా 114 మంది అసెంబ్లీ అభ్యర్ధులతో తొలి జాబితాను ఆర్భాటంగా రిలీజ్ చేసింది. అలాగే అయిదు ఎంపీ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. సీఎం అవుతారు షర్మిల అని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్న వేళ ఆమె ఎంపీగా పోటీ చేయడం ఏంటో అర్థం కాని విషయమే.

పైగా షర్మిల తొలిసారి పోటీ చేస్తున్నారు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు. అలా చూస్తే పీసీసీ చీఫ్ ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీకే పోటీ చేస్తారు. కానీ షర్మిల మాత్రం ఎంపీగానే పోటీ చేస్తున్నారు ఇది కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశం అనుకోవాలి.

ఇక అసెంబ్లీ జాబితాలో అతి కొద్ది మంది పేర్లు తప్ప చాలా మంది పేర్లు పెద్దగా తెలియనివే ఉన్నాయి. ఏపీలో చూస్తే హోరా హోరీ పోరు సాగుతోంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీయే గెలుపు కోసం ఎన్నో ఎత్తులు వ్యూహాలు రచిస్తోంది. అలాంటిది కాంగ్రెస్ మాత్రం తన అభ్యర్థుల జాబితాలో ఏ ప్రమాణాలు ఏ వ్యూహాలను పాటిస్తూ ఎంపిక చేసింది అన్నది తెలియడం లేదు.

నిజానికి కాంగ్రెస్ ఇంత నంబర్ తో అభ్యర్ధులను రిలీజ్ చేయడమే గొప్ప అనుకుంటే మాత్రం విశ్లేషించడం కూడా అనవసరం అంటున్నారు. సరే కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేశారు. మరి ఇందులో గెలుపు గుర్రాలు ఎన్ని అంటే జవాబు మాత్రం పెద్దగా రావడంలేదు. ఎందుచేతనంటే ముందే చెప్పుకున్నట్లుగా ఏపీలో భీకర యుద్ధమే సాగుతోంది.

ఈ యుద్ధంలో పోరాటానికి గట్టిగానే అంతా ప్రిపేర్ కావాల్సి ఉంది. కానీ ఆ కసరత్తు ఏదీ చేసినట్లుగా ఈ జాబితా చూస్తే కనిపించడం లేదు. వైసీపీ నుంచి టికెట్లు రాని ఇద్దరికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. అంతే తప్ప అనేక కీలక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి ఎవరూ జంప్ చేసి కాంగ్రెస్ టికెట్ కోరుకోలేదు అని స్పష్టం అవుతోంది.

దీనిని బట్టి రాజకీయ నేతలు అభ్యర్ధులు ఆశావహులు కాంగ్రెస్ ని లైట్ తీసుకుంటున్నారు అనే అంటున్నారు. ఇక జనాలు కూడా ఎలా చూస్తారో అన్నది ఒక చర్చ. అయితే గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ కి డిపాజిట్లు గల్లంతు అయ్యారు. ఒకరిద్దరు మాత్రమే ఆ గండం గట్టెక్కారు. ఓవరాల్ గా చూస్తే భారీ షాక్ తోనే కాంగ్రెస్ రెండు ఎన్నికల్లో ఉంది.

ఇపుడు అంతకు మించి అద్భుతాలు అయితే జరిగే అవకాశాలు అయితే ఉంటాయా అన్న డౌట్లు జాబితా చూస్తే అనిపిస్తోంది. పోటీ చేయాలని చేయడం వేరు. కనీసంగా కొన్ని సీట్లు అయినా గెలుచుకోవాలని చూడడం వేరు. అలా ఆలోచిస్తే గెలుపు కచ్చితంగా దక్కుతుంది అన్నది అయితే లేదు అనే అంటున్నారు.

ఇక గట్టి పోటీ ఇస్తారు డిపాజిట్లు అయినా దక్కించుకుంటారు అన్న వారు కూడా ఈ జాబితాలో ఎంత వెతికినా కనిపించడం లేదు అన్నది ఒక కఠినమైన రాజకీయ విశ్లేషణం. ఏది ఏమైనా షర్మిల వస్తే కాంగ్రెస్ లో మార్పు ఉంటుందని ప్రచారం అయితే సాగింది. దానికి విరుద్ధంగా జాబితా ఉంది అని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి గట్టి అభ్యర్థులను కొందరి అయినా లాగి కాంగ్రెస్ పోటీకి పెడుతుందనుకుంటే ఆ ప్రక్రియ ఏదీ జరిగినట్లుగా కనిపించడంలేదు.

దాంతో కాంగ్రెస్ షరా మామూలు పోటీగానే చూడాలని అంటున్నారు. ఇక ఎంపీ అభ్యర్థుల విషయంలో కొంత అయితే ఆలోచించవచ్చు అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రులు పళ్ళం రాజు, జేడీ శీలం వైఎస్ షర్మిల వంటి గట్టి అభ్యర్ధులు ఉన్నారు. వీరు కూడా గెలుపు విషయంలో ఎంతవరకూ ప్రయత్నాలు చేస్తారు అన్నది చూడాలి. మొత్తం మీద చూసుకుంటే షర్మిల పీసీసీ చీఫ్ అయినా కాంగ్రెస్ కి గట్టి అసెంబ్లీ అభ్యర్ధులు అయితే కరవు అలాగే కంటిన్యూ అవుతోంది అని అంటున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చాలా మంది డిపాజిట్ల గల్లంతు గండం నుంచి తప్పించుకోలేరు అని అంటున్నారు. చూడాలి మరి ఏపీలో హస్త రేఖలు ఎలా ఉండబోతున్నాయో.