Begin typing your search above and press return to search.

జగన్‌ పై షర్మిల షాకింగ్ కామెంట్స్.. "నీ కన్నా చంద్రబాబే మేలు కదా"!

అవును... తాజాగా ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వంతో సమరానికి కాలుదువ్విన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Feb 2024 9:58 AM GMT
జగన్‌  పై షర్మిల షాకింగ్  కామెంట్స్.. నీ కన్నా చంద్రబాబే మేలు కదా!
X

ఏపీ పీసీసీ చీఫ్‌ గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ వైఎస్ షర్మిల దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు షర్మిళ. వైసీపీ పాలనపైనా, జగన్ పనితీరుపైనా.. మైకందుకున్న ప్రతీసారీ ఫైరవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిళ. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... తాజాగా ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వంతో సమరానికి కాలుదువ్విన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈరోజు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో "ఛలో సెక్రటేరియట్‌"కు పిలుపునివ్వగా.. పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు. ఈ క్రమంలోనే బుదరవారం రాత్రి షర్మిల.. ఆంధ్రరత్న భవన్‌ కు చేరుకుని అక్కడే నిద్రపోయారు కూడా!

ఈ క్రమంలో డీఎస్సీ నోటిఫికేషన్ పేరు చెప్పి జగన్ పై షర్మిల నిప్పులు చెరిగారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో అతి పెద్ద సమస్యల్లో ఒకటిగా ఉన్న నిరుద్యోగానికి ఈ ప్రభుత్వం ఎలాంటి పరిష్కారాలు చూపించిందో చెప్పాలని మొదలుపెట్టిన షర్మిళ... చదువుకున్న చదువులకు ఎలాంటి సంబంధం లేకుండా యువత ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో సుమారు 21 వేల మంది బిడ్డలు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిళ తెలిపారు.

ఇదే సమయంలో... చంద్రబాబు హయాంలో కూడా యువతకి అన్యాయం జరిగిందని చెప్పిన షర్మిళ... హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా... తాము అధికారంలోకి వస్తే లక్షా 43 వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పిన జగన్... గతంలో మెగా డీఎస్సీ భర్తీ విషయంలో చంద్రబాబును విమర్శించిన జగన్.. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ ఇవ్వకుండా దగా డీఎస్సీ ఇచ్చారని నిప్పులు చెరిగారు.

ఇదే క్రమంలో... 23 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్... 23వేల పోస్టులకు బదులు కేవలం 7వేల ఉద్యోగాలే ఎందుకు వేస్తున్నారని అప్పుడు చంద్రబాబుని ప్రశ్నించారని గుర్తు చేశారు షర్మిళ. మరి ఇప్పుడు మీరు 6వేల ఉద్యోగాలే ఎందుకు వేసారని జగన్ ను ప్రశ్నించారు. ఈ లెక్కన చూసుకుంటే... "మీ కంటే చంద్రబాబు నాయుడే మేలు కదా.. మీ కంటే చంద్రబాబు నాయుడే ఎక్కువ ఉద్యోగాలిచ్చారు.. ఆయన కంటే ఘోరం అని మిమ్మల్ని మీరే నిరూపించారు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరోపక్క ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఇందులో భాగంగా గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... షర్మిలను చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో.. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో షర్మిలతో పాటు కార్యకర్తలు, నాయకులను దుగ్గిరాల పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.