Begin typing your search above and press return to search.

పాక్ ర్యాలీలో అఫ్రీదీ హల్ చల్... ధావన్ ట్వీట్ గుర్తు చేస్తున్న నెటిజన్లు!

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సంబరాల్లో, సంబర ర్యాలీల్లో తాజాగా క్రికెటర్ షాహీద్ అఫ్రీది కనిపించారు. దీంతో.. నెట్టింట రచ్చ మరింత వేడెక్కింది!

By:  Tupaki Desk   |   12 May 2025 11:22 AM
పాక్ ర్యాలీలో అఫ్రీదీ హల్ చల్... ధావన్ ట్వీట్ గుర్తు చేస్తున్న నెటిజన్లు!
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా... భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి భారత్ చేతిలో పాక్ కు పరాజయం తప్పదని.. అయితే, ఈసారి మాత్రం 1971 రేంజ్ కు మించి ఉంటుందనే చర్చ జరిగింది. అయితే సడన్ గా అన్నట్లుగా సీజ్ ఫైర్ ప్రకటన వచ్చింది.

ఇందులో భాగంగా... భారత్ - పాక్ కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. దీనిపై భారత్ లో జరుగుతున్న రచ్చ సంగతి అలా ఉంటే... పాకిస్థాన్ ను ట్రంప్ కాపాడేశారనే కామెంట్లు మాత్రం వినిపించాయి. అయితే.. పాకిస్థాన్ ప్రధాని మాత్రం భారత్ పై చారిత్రక విజయం సాధించినట్లు చెప్పుకున్నారు.

దీంతో... పాకిస్థాన్ ప్రజలు సంబరాలకు దిగారు. ఇందులో భాగంగా.. ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంఛర్లు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. పాక్ కు అనుకూలంగా, భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీరికోసమా ట్రంప్ మధ్యవర్తిత్వం చేసిందనే కామెంట్లు వినిపించాయి.

సీజ్ ఫైర్ వల్ల భారత్ పై పాకిస్థాన్ చారిత్రక విజయం సాధించడం సంగతేమో కానీ... భారతదేశానికి మాత్రం ట్రంప్ చారిత్రక ద్రోహం చేశారనే మాటలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సంబరాల్లో, సంబర ర్యాలీల్లో తాజాగా క్రికెటర్ షాహీద్ అఫ్రీది కనిపించారు. దీంతో.. నెట్టింట రచ్చ మరింత వేడెక్కింది!

అవును... కాల్పుల విరమణ తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ రోడ్లపై భారీ ర్యాలీ నిర్వహిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీపులో ర్యాలీగా వెళ్తూ అఫ్రీదీ ప్రజలకు అభివాదం చేస్తున్నాడు. ఆ సమయంలో అతడు ఆర్మీ తరహా టీ-షర్ట్ ధరించి ఉన్నాడు! రోడ్లపై హల్ చల్ చేస్తున్నాడు.

దీంతో.. సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ కు మళ్లీ నోరెత్తకుండా బుద్ది చెప్పే అవకాశం దొరికినా భారత్ వదులుకుందనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఎవరు ఏమనుకున్నా.. కాల్పులు విరమించి, చర్చలకు సిద్ధమవ్వడం మాత్రం చాలా మంది సగటు భారతీయులకు అసంతృప్తి కలిగించనేది వాస్తవం అనేది నెటిజన్ల మాటగా ఉంది.

కాగా... ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడిపై స్పందించిన షాహిద్ అఫ్రీదీ... "ఈ దాడిని భారత సైన్యం ఎందుకు అడ్డుకోలేకపోయింది?" అంటూ వంకరగా స్పందించిన సంగతి తెలిసిందే. దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ సమయంలో శిఖర్ ధావన్ ఎంట్రీ ఇచ్చాడు. అఫ్రీద్ స్పిన్ ను బాది బాది వదిలినట్లు కౌంటర్ ఇచ్చాడు.

ఇందులో భాగంగా... మేము మీ దేశాన్ని కార్గిల్ యుద్ధంలో ఓడించాం.. అది మర్చిపోయారా? ఇప్పటికే మీరు దారుణంగా పతనమయ్యారు. ఇంకా ఎంత దాకా దిగజారతారు? ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడంమాని.. మీ దేశ పరిస్థితిని మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టండి అని చురకలతో సూచించాడు. భారత సైన్యంపై మేమంతా గర్వపడుతున్నామని ఎక్స్ వేదికగా వెల్లడించాడు.