లిక్కర్ స్కాంలో బిగ్ అప్డేట్.. ఒకేసారి కోర్టుకు వచ్చిన ఏడుగురు కీలక నిందితులు
ఏపీ లిక్కర్ స్కాంలో ఏడుగురు నిందితులను పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు.
By: Tupaki Desk | 20 May 2025 7:57 AMఏపీ లిక్కర్ స్కాంలో ఏడుగురు నిందితులను పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుల రిమాండ్ గడువు తీరిపోవడంతో ఈ రోజు కోర్టులో తిరిగి హాజరుపరిచారు. నిందితులు ఒక్కొక్కరిని ఒక్కో సమయంలో అరెస్టు చేయడంతో రిమాండ్ గడువు ఇప్పటివరకు వేర్వేరు తేదీలు ఉండేది. అయితే నిందితులు అందరినీ ఒకేసారి హాజరుపరచాలని కోర్టు ఆదేశించడంతో అరెస్టు చేసిన ఏడుగురిని ఒకేసారి కోర్టుకు తీసుకువచ్చారు.
లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితోపాటు ఇతర నిందితులు అందరికీ రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులకు జూన్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కేసులో నిందితులైన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, క్రిష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలను పోలీసులు ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు. అయితే కేసు దర్యాప్తులో పురోగతి తమకు తెలియజేయడం లేదని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కేసు దర్యాప్తు వివరాలను కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. రిమాండ్ పొడిగింపుతోపాటు దర్యాప్తు పురోగతిని లిఖితపూర్వకంగా సమర్పించాలని దర్యాప్తు అధికారికి సూచించింది. కాగా, తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించాలని నిందితులు కోరగా, మానవతా కోణంలో ఒక్కొక్కరికి 30 నిమిషాలు చొప్పున కేటాయించింది. కుటుంబ సభ్యులతో తప్ప ఇతరులతో మాట్లాడకూడదని స్పష్టం చేసింది. మరోవైపు కీలక నిందితులుగా భావిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహనరెడ్డిలను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ మెమో దాఖలు చేసింది. దీనిపై రేపు విచారించే అవకాశం ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.