Begin typing your search above and press return to search.

హర్ట్ అయ్యానంటున్న సీతక్క... కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   7 Dec 2023 4:25 AM GMT
హర్ట్  అయ్యానంటున్న సీతక్క... కామెంట్స్  వైరల్!
X

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. "ఇన్ ప్రణబ్.. మై ఫాదర్: ఎ డాటర్ రిమెంబర్స్" పుస్తకం గురించి మాట్లాడుతున్న సందర్భంగా ఆమె రాహుల్ గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. దీంతో ఈమె వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత సీతక్క ఫైర్ అయ్యారు.

అవును... రాహుల్ గాంధీపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై సీతక్క సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ లో ఫైరయ్యారు. ఇందులో భాగంగా... తాను చాలా హర్ట్ అయినట్లు ఆమె తెలిపారు. అనంతరం... మెదడులో ఏదైనా లోపం ఉంటే ఆస్పత్రికి వెళ్లాలంటూ శర్మిష్ఠ ముఖర్జీకి సూచించారు.

ఈ విధంగా ఎక్స్ లో స్పందించిన సీతక్క.. "నేను నిజంగా బాధపడ్డాను. అసలు మీకు ఏమైందో నాకు తెలియదు శర్మిష్ఠ ముఖర్జీ. మీ మెదడులో ఏదైనా లోపముంటే ఆస్పత్రికి వెళ్లండి. కానీ... మీ వ్యక్తిగత ప్రయోజనాలకోసం తండ్రి వారసత్వాన్ని పాడుచేయకండి" అని అన్నారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

కాగా... దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ పుస్తకం రాశారు. బతికున్న రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ డైరీలో రాసుకున్న, ఆయన చెప్పిన విషయాలపై అధ్యయనం చేసి ఆమె పుస్తకాన్ని రాసినట్లు చెబుతున్నారు. ఈ పుస్తకంలో ప్రధానంగా నెహ్రూ - గాంధీ కుటుంబంపై ప్రణబ్ ముఖర్జీకి ఉన్న వ్యక్తిగత ఆరాధనతోపాటు రాహుల్ రాజకీయ భవిష్యత్తుపై సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌ వంటి దోషులను కాపాడేందుకు 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ను పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ చెత్తబుట్టలో పడేసిన తీరుపై తన తండ్రి కలత చెందారని ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు!

ఇదే క్రమంలో రాహుల్ గాంధీ రాజకీయంగా పరిపక్వతతో లేరని.. అవగాహన లేకుండా ఉన్నారని ప్రణబ్ భావించారని ఆమె తెలిపారు. గాంధీ - నెహ్రూల అహంకారమంతా రాహుల్ గాంధీకి వచ్చింది కానీ.. వారి రాజకీయ చతురతే అబ్బలేదని డైరీలో రాసుకున్నారని చెబుతూ ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. 2014 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం తర్వాత రాహుల్ గాంధీ తరుచుగా పార్లమెంట్‌ కి గైర్హాజరు కావడం పట్ల ప్రణబ్ అసంతృప్తితో ఉండేవారని శర్మిష్ట తెలిపారు.

దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు. ఆమె తన వ్యక్తిగత ప్రయోజనాలకోసమే సొంత కవిత్వం అల్లుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేత సీతక్క ఫైరయ్యారు. ఆన్ లైన్ వేదికగా శర్మిష్ఠపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మైండ్ బాగోకపోతే ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇచ్చారు.