రూ.2200కోట్ల కుంభకోణంలో మాజీ గవర్నర్.. ఆసుపత్రి నుంచి ఫోటో వైరల్!
కిరూ జలవిద్యుత్ ప్రాజెక్టులో జరిగిన ఈ దర్యాప్తు 2022లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ప్రారంభమైంది.
By: Tupaki Desk | 23 May 2025 6:36 AMజమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన, మరో ఐదుగురిపై సీబీఐ (CBI) రూ.2200 కోట్ల అవినీతి కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్ దాఖలైన వెంటనే సత్యపాల్ మాలిక్ ఆసుపత్రిలో ఉన్న ఫోటో ఒకటి బయటపడింది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో సత్యపాల్ మాలిక్ ఆసుపత్రిలో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో "నా శ్రేయోభిలాషుల నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి, వాటిని నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను. నా ఆరోగ్యం చాలా క్షీణించింది. నేను ఎవరితోనూ మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. మే 11 నుంచి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరాను. ఇన్ఫెక్షన్ ఫిర్యాదుతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. గత మూడు రోజులుగా కిడ్నీ డయాలసిస్ చేస్తున్నారు" అని పేర్కొన్నారు.
అవినీతి కేసులో ఎలా చిక్కుకున్నారు?
రూ.2200 కోట్ల అవినీతి కేసు కిరూ జలవిద్యుత్ ప్రాజెక్టు (Kiru Hydroelectric Power Project)కు సంబంధించినది. ఈ ప్రాజెక్టులో సివిల్ వర్క్ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. సీబీఐ దర్యాప్తులో కిరూ ప్రాజెక్టు కాంట్రాక్టులలో అవకతవకలు జరిగినట్లు తేలింది. కిరూ హైడ్రోపవర్ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఉంది. ఈ ప్రాజెక్టును చెనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (CVPPPL) అమలు చేస్తోంది. సీబీఐ దర్యాప్తు ప్రకారం, ప్రాజెక్టులోని సివిల్ వర్క్స్ కోసం టెండర్ ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. CVPPPL బోర్డు సమావేశంలో టెండర్ ప్రక్రియను ఈ-టెండరింగ్, రివర్స్ ఆక్షన్ ద్వారా తిరిగి నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఈ నిర్ణయాన్ని అమలు చేయకుండా కాంట్రాక్టును నేరుగా పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు అప్పగించారు.
లంచం ఆఫర్ చేసినట్లు ఒప్పుకున్నరు
కిరూ జలవిద్యుత్ ప్రాజెక్టులో జరిగిన ఈ దర్యాప్తు 2022లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ప్రారంభమైంది. ఇందులో రెండు కాంట్రాక్టులలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు కోరింది. ఈ ఆందోళనలను మొదట లేవనెత్తింది సత్యపాల్ మాలికే. ఆయన 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా పనిచేశారు. మాలిక్ బహిరంగంగా ఒక ఆరోపణ చేశారు.. రెండు ఫైళ్లకు ఆమోదం తెలపడానికి తనకు రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని. ఆ రెండు ఫైళ్లలో ఒకటి కిరూ ప్రాజెక్టుకు సంబంధించినదే.
2024లో సీబీఐ దర్యాప్తు
2024లో, కిరూ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులో రూ.2,200 కోట్ల అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, జమ్మూలో 8 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సత్యపాల్ మాలిక్ నివాసంలో కూడా తనిఖీలు జరిగాయి. గత సంవత్సరం తన నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించిన తర్వాత, ఆయన అవినీతి ఆరోపణలన్నింటినీ ఖండించారు. తాను ఎవరిపై అవినీతి ఆరోపణలు చేశానో వారిని దర్యాప్తు చేయకుండా, ఏజెన్సీ తనను లక్ష్యంగా చేసుకుందని మాలిక్ ఆరోపించారు. "నాకు 4-5 కుర్తాలు, ప్యాజమాలు తప్ప ఏమీ లేవు. నియంతృత్వ ప్రభుత్వం ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ నన్ను బెదిరించడానికి ప్రయత్నిస్తోంది" అని ఆయన అన్నారు.
ఎవరిపై కేసులు నమోదయ్యాయి?
తాను ఒక రైతు బిడ్డనని, తాను భయపడనని, తలవంచనని ఆయన ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఈ కేసులో సీబీఐ చెనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (CVPPPL) అప్పటి చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, అధికారులు ఎం.ఎస్. బాబు, ఎం.కె. మిట్టల్, అరుణ్ కుమార్ మిశ్రా, పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్పై కేసు నమోదు చేసింది. 47వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పాటించకుండా, కాంట్రాక్టును అక్రమంగా ఇచ్చారని ఎఫ్ఐఆర్ ఆరోపించింది.