Begin typing your search above and press return to search.

వచ్చేస్తోంది శాటిలైట్ ఇంటర్నెట్... టారిఫ్ వివరాలివే!!

ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ తో పాటు ఇతర కంపెనీలు కలిసి త్వరలో భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ క్రమంలో డేటా సేవలను తక్కువ ధరకే అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   24 May 2025 9:50 AM
వచ్చేస్తోంది శాటిలైట్ ఇంటర్నెట్... టారిఫ్ వివరాలివే!!
X

ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ అత్యధికవేగంతో ఇంటర్నెట్ సేవలు పోందే అవకాశం ఇప్పుడు భారత్ లోనూ అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇందులో భాగంగా.. దేశంలో త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో తొలిదశలో యూజర్లను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలోనే డేటా సేవలను అందించనున్నారని తెలుస్తోంది.

అవును... ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ తో పాటు ఇతర కంపెనీలు కలిసి త్వరలో భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ క్రమంలో డేటా సేవలను తక్కువ ధరకే అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. నెలకు 10 డాలర్ల కంటే తక్కువ (సుమారు రూ.840)కే ప్లాన్ ధరలు ఉండొచ్చని అంటున్నారు.

ముందు ఆయా కంపెనీలు తమ యూజర్ బేస్ ను పెంచుకోవడంపై దృష్టిసారించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో 10 డాలర్ల కంటే తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ను అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో ముందుగా 10 మిలియన్ కస్టమర్లను చేరుకోవడం ద్వారా స్పెక్ట్రం కాస్ట్ ను భర్తీ చేసుకోవడం సాధ్యమవుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

వాస్తవానికి లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రం ఛార్జీలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు! ఇందులో భాగంగా.. ఒక్కో అర్బన్ యూజర్ నుంచి రూ.500 చొప్పున ఫీజు వసూలు చేయాలని ట్రాయ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇది సాధారణ సర్వీసులతో పోలిస్తే చాలా ఎక్కువ! మరోపక్క ఎం.హెచ్.జెడ్ స్పెక్ట్రానికి ఏడాదికి మినిమం రూ.3,500 ఫీజును ట్రాయ్ ప్రతిపాదించింది.

ఈ స్థాయిలో ఫీజులు, స్పెక్ట్రం ఛార్జీలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి వినియోగదారులను పెంచుకునే క్రమంలో తక్కువ ధరకే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో.. దేశీయంగా స్టార్ లింక్ సేవలు ప్రారంభించేందుకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ అనుమతులు లభిస్తే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే పౌరులకు అందుబాటులోకి రానున్నాయి.