ఎవరీ సామ్రాట్ చౌదరి ... నితీష్ ప్లేస్ లో బీజేపీ సీఎం !
అవే వర్కౌట్ అవుతూంటాయి. అందుకే బీహార్ లో సీఎం గా నితీష్ కుమార్ పదవీకాలం కొద్ది నెలలు మాత్రమే అని అక్కడ ప్రత్యర్థులు కూడా సులువుగా అనగలుస్తున్నారు.
By: Tupaki Desk | 15 April 2025 5:53 PMకేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి కీలకమైన మద్దతు ఇస్తున్న రెండవ పెద్ద మిత్ర పార్టీ జేడీయూ. ఆ పార్టీ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్. ఆయన పార్టీకి 12 మంది ఎంపీలు ఉన్నారు. వారు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది. మరి అలాంటి పార్టీని అధినాయకుడిని ఎలా చూసుకోవాలి. అయితే రాజకీయాల్లో తెర ముందు ఈ సమీకరణలు ఉంటే తెర వెనక బోలెడు సమీకరణలు ఉంటాయి.
అవే వర్కౌట్ అవుతూంటాయి. అందుకే బీహార్ లో సీఎం గా నితీష్ కుమార్ పదవీకాలం కొద్ది నెలలు మాత్రమే అని అక్కడ ప్రత్యర్థులు కూడా సులువుగా అనగలుస్తున్నారు. ఇక బీజేపీకి చెందిన బీహార్ నేతలు అయితే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నితీష్ కుమార్ ని ఉప ప్రధానిగా చేయాలని చెప్పడం ద్వారా ఆయనకు బీహార్ సీఎం సీటు లేదని పరోక్షంగా చెబుతున్నారన్న మాట.
ఇపుడు మరో బాంబు పేల్చారు బీజేపీ కీలక నేత. ఆయన ఆ రాష్ట్రానికి చెందిన వారు కాదు, హర్యానా సీఎం గా ఉన్న నయాబ్ సింగ్ సైనీ బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరో చెప్పేశారు. బీహార్ కి ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా సామ్రాట్ చౌదరి ఉంటారని సంచలన ప్రకటనను తాజాగా చేశారు. ఆయనే బీహార్ కి కాబోయే సీఎం అని ధీమాగా ఆయన చెప్పారు అంటే బీజేపీ పెద్దల ఆలోచనలు ఆయన గమనించే ఇలా చెప్పారని అంటున్నారు.
అదే కనుక జరిగితే నితీష్ కుమార్ ఫ్యూచర్ ఏమిటి అన్న చర్చ సాగుతోంది. బీహార్ ని రెండు దశాబ్దాలుగా ఎదురులేకుండా పాలిస్తున్న నితీష్ కుమార్ భవిష్యత్తుని బీజేపీ ఏ విధంగా నిర్ణయించిందో అన్నది అయితే ఎవరికీ తెలియడం లేదు అని అంటున్నారు. నితీష్ కుమార్ పట్ల జనంలో అయితే ఆ అభిమానం విశ్వాసం ఉన్నాయి. ఆయనకు ఆదరణ కూడా అదే స్థాయిలో ఉంది. ఎన్డీయేలో నితీష్ కుమార్ ని కాదని ఆ స్థాయిలో ప్రజలలో ఇమేజ్ ఉన్న నాయకుడు మరొకరు లేరు.
కానీ బీజేపీ ఈసారి కొత్త ఫేస్ తో ఎన్నికలకు వెళ్ళాలని అనుకుంటోంది. నితీష్ కుమార్ కి సీఎం గా ఇన్నింగ్స్ ముగిసాయని చెప్పాలని అనుకుంటోంది. మరి ఆయనకు కేంద్రంలోకి తెచ్చి కీలక పదవి ఇస్తారా లేక ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపుతారా అన్నది కూడా చర్చగా ఉంది.
మొత్తానికి బీజేపీ అయితే ఈసారి బీహార్ సీఎం పీఠాన్ని వదులుకోరాదు అని గట్టి పట్టుదలతో ఉంది అని అంటున్నారు. అయితే మరో అయిదు నెలలు ఎన్నికలకు వ్యవధి ఉండగానే బీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరి అని మరో బీజేపీ సీఎం ప్రకటించడంతో రాజకీయంగా కలకలం రేపుతోది. మరి అదే నిజమా ఏమిటి అని కూడా ఆలోచిస్తున్నారు.
ఇంతకీ ఎవరీ సామ్రాట్ చౌదరి అంటే ఆయనది బీహార్ లో మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంగా ఉంది. 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా శాసనసభ నియోజకవర్గం నుండి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా ఆయన పనిచేశారు.
ఆ తర్వాత ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్గా నియమితుడయ్యాడు. అతను 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ మీదట 2018లో సామ్రాట్ చౌదరి బీజేపీలో చేరి బీహార్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2023 మార్చి నుంచి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
అంతే కాదు సామ్రాట్ చౌదరి 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. అంటే ఆయన రాజకీయ మూలాలు ఆర్జేడీలో ఉన్నాయన్న మాట. ఆయనను బీజేపీ తెచ్చి బీహార్ లో ఇంతటి నేతను చేసింది. ఆయన కనుక పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు జేడీయూ ఇటూ ఆర్జేడీ కూశాలను కదల్చడం సులువు అని భావించే ఇలా వ్యూహ రచన చేసింది అని అంటున్నారు. చూడాలి మరి హర్యానా సీఎం చేసిన ప్రకటనలో నిజమెంత ఉందో.