Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తెలివే తెలివి.. మన్మోహన్ పేరును భలేగా వాడేశారుగా?

పహల్గాం ఉగ్రదాడి వేళ.. అందరి చూపు ప్రధాని నరేంద్ర మోడీ వైపు ఉండటం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ గ్రాఫ్ భారీగా పెరిగింది.

By:  Tupaki Desk   |   2 May 2025 11:30 AM
Sachin Pilot Hits Back Amid Rising BJP Wave
X

పహల్గాం ఉగ్రదాడి వేళ.. అందరి చూపు ప్రధాని నరేంద్ర మోడీ వైపు ఉండటం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ గ్రాఫ్ భారీగా పెరిగింది. అదే సమయంలో ఉగ్రదాడికి సంబంధం ఉన్న ఏ ఒక్కరిని విడిచి పెట్టేది లేదని.. వారిని వెతికి వెతికి మరీ శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్ వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో బీజేపీ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతున్న వేళ..అధికార పార్టీకి మించిన దేశభక్తి తమ సొంతమన్న విషయాన్ని దేశ ప్రజలకు చెప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు నానా తిప్పలు పడుతున్నారు.

తాజా ఉదంతం ఆ కోవలోకే వస్తుంది. తాజాగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు సచిన్ పైలెట్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో మన్మోహన్ సింగ్ ఎప్పుడూ పాకిస్థాన్ ను సందర్శించలేదన్నారు. ఆ దేశానికి వెళ్లటం సరికాదన్న భావనతోనే ఆ పని చేశారన్నారు. రాజకీయ జీవితంలో మన్మోహన్ దేశానికే ప్రాధాన్యాన్ని ఇచ్చారన్నారు.

సచిన్ పైలెట్ మాట్లాడుతూ.. ‘‘ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ ఎప్పుడూ పాక్ కు వెళ్లలేదు. అక్కడి తన సొంతూరును సందర్శించలేదు. ఆయన్ను ఎవరు ఆపారు? వాస్తవానికి చాలాసార్లు ఆయనకు ఆహ్వానం అందింది. అయినప్పటికీ వెళ్లటం సరైనది కాదని భావించి వెళ్లలేదు. మాజీ ప్రధాని వాజ్ పేయ్.. మాజీ ఉప ప్రధాని అద్వాణీ.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీలు దాయాది దేశ పర్యటనకు వెళ్లారు. కానీ.. సోనియా గాంధీ.. మన్మోహన్ సింగ్ లు మాత్రం పాకిస్తాన్ కు వెళ్లలేదు. ఎందుకంటే.. దేశమే ముందు అని చెప్పటం సులువు. కానీ.. ఆ మాట మీద నిలబడటం కష్టం. మన్మోహన్ మాత్రం తన రాజకీయ జీవితంలో ఈ సూత్రానికి కట్టుబడి ఉన్నారు’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదంతా చూస్తే.. తాజా ఉద్రిక్తతల వేళ.. కాంగ్రెస్ ను ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి వేళ.. తమకు మించిన దేశ భక్తులు.. దేశం గురించి ఆలోచించే పార్టీ మరేదీ లేదన్నట్లుగా చెప్పుకోవటమే సచిన్ పైలెట్ లక్ష్యంగా చెప్పొచ్చు. అంతేకాదు.. భారత్ అణుశక్తిగా ఎదగటంలో మన్మోహన్ సింగ్ కు చాలావరకు క్రెడిట్ తగ్గుతుందని పేర్కొనటం ఈ కోవలోకే వస్తుందని చెప్పాలి. మొత్తానికి మన్మోహన్ పేరుతో పాక్ విషయంలో తమకు మించి కఠినంగా ఎవరూ లేరన్న ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు పడిన కష్టం అంతా ఇంతా కాదని చెప్పాలి.