భారత్ను సొంతిల్లుగా భావించిన రష్యన్ మహిళ.. జవాన్ల త్యాగానికి సెల్యూట్..వీడియో వైరల్
భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ, ఒక రష్యన్ మహిళ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 14 May 2025 9:20 AMభారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ, ఒక రష్యన్ మహిళ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. హర్యానాలోని గురుగ్రామ్లో నివసిస్తున్న రష్యన్ మహిళ పోలినా అగర్వాల్ భారత సైన్యం పట్ల తనకున్న కృతజ్ఞతను వ్యక్తం చేశారు. భారత్ను తన సొంత ఇల్లుగా అభివర్ణించారు. ఆమె ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా అది క్షణాల్లో లక్షలాది మంది హృదయాలను తాకింది.
పోలినా అగర్వాల్ భారతీయ జవాన్ల ధైర్యాన్ని, దేశ రక్షణ పట్ల వారి అంకితభావాన్ని ఎంతగానో ప్రశంసించారు. తన భావోద్వేగపూరిత సందేశంలో ఆమె ఇలా అన్నారు, "భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వార్తలు విన్న వెంటనే నా రష్యన్ బామ్మ నన్ను వెంటనే ఇంటికి తిరిగి రమ్మని చెప్పింది. దానికి నేను సమాధానమిచ్చాను, ఏ ఇల్లు? నేను ఇప్పుడే భారతదేశంలో నా ఇంట్లోనే ఉన్నాను." అని తెలిపారట.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. "భారతీయ సైన్యం వద్ద అత్యాధునిక ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు ఉన్నాయి, వాటిని స్వయంగా రష్యానే సరఫరా చేసింది. దేశంలోకి చొరబడటానికి ప్రయత్నించే డ్రోన్లు, జెట్లు లేదా ఏదైనా ఎగిరే వస్తువులను ఎదుర్కొనే అంత ఇవి చాలా శక్తివంతమైనవి" అని అన్నారు.
భారతీయ సైనికుల నిస్వార్థ సేవను కూడా ఆమె కొనియాడారు. "వారు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టే మనం రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. సరిహద్దుల్లో ఏమి జరుగుతుందో మనకు తెలియదు కూడా" అని పోలినా అగర్వాల్ అన్నారు.
భారతీయ సైనికుల అంకితభావానికి తాను ఎంతో రుణపడి ఉన్నానన్నారు. ఆమె వీడియోను లక్షన్నర మందికి పైగా వీక్షించగా, ఆమె హృదయానికి హత్తుకునే సందేశానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. "మా ధైర్యవంతులైన జవాన్లకు వందనం" అని అన్నారు. మరొక యూజర్, "మరో దేశానికి చెందిన వ్యక్తి మన సాయుధ బలగాల పట్ల ఇంత ప్రేమ, గౌరవం చూపడం చాలా ఆనందంగా ఉంది" అని రాశారు.