ఈ సమ్మర్ చాలా కూల్.. రోళ్లు పగిలే రోహిణి కార్తె ఇక లేనట్లే..!
తాజాగా శనివారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీనికిముందే అండమాన్ దీవులను చేరాయి. ఇది సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే కావడం గమనార్హం.
By: Tupaki Desk | 25 May 2025 3:36 AMమామూలుగా అయితే రోళ్లు మనుషులు ఎంతో కష్టపడితే కానీ పగలవు.. కానీ, రోహిణి కార్తెలో మాత్రం అవి బద్దలవుతాయని తెలుగు నానుడి. దీనికి కారణం విపరీతమైన ఎండలు. బయటకు రావాలంటనే భయపడేలా.. ఇంట్లో ఉన్నా ఉక్కపోతతో సతమతం అయ్యేలా.. గోడలూ వేడెక్కేంత తీవ్రంగా ఉంటాయి రోహిణి కార్తె ఎండలు. అయితే, ఈ ఏడాది మాత్రం రోళ్లు పగిలే రోహిణి కార్తె లేదనే అనిపిస్తోంది. మే నెల మొదటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా వర్షాలు.. మధ్యమధ్యలో ఎండ కాసినా అది మే నెల స్థాయిలోనే లేదు. మరోవైపు అసలు ఇది వేసవి కాలమేనా? అని చాలామందికి అనిపించింది కూడా. రెండేళ్ల కిందట చూస్తే సుదీర్ఘ వేసవి కొనసాగింది.
మే నెలకు వచ్చేసరికి ఎండలు ముదిరిపోయాయి. కనీసం కాలు బయట పెట్టలేనిని పరిస్థితి వచ్చింది. ఈ ఎండలకు రుతుపవనాలు కూడా బెదిరినట్లున్నాయి. 2023లో ఏకంగా వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి వచ్చాయి. ఇక నిరుడు కూడా ఎండలు అధికంగానే ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం అమ్మో ‘మే నెల’ అనే పరిస్థితి పెద్దగా రాలేదు.
తాజాగా శనివారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీనికిముందే అండమాన్ దీవులను చేరాయి. ఇది సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే కావడం గమనార్హం. అంటే.. ఇంకా మే నెల వారం రోజులు ఉండగానే దేశంలోకి రుతుపవనాలు వచ్చేశాయి. అంతేగాక రెండు, మూడు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి కూడా విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చెబుతోంది. అదే జరిగితే జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతోంది.
వాస్తవానికి ఏటా జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు వస్తుంటాయి. ఈ ఏడాది చాలా ముందుగానే వచ్చేశాయి. ఇలా జరగడం అంచనాకు అందలేదు. ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. 2009లో మే 23నే నైరుతి కేరళను తాకింది. 2024లో మే 30న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళను చేరాయి.
ఇక ఎండలు లేనట్లే?
ఈ ఏడాది రోహిణి కార్తె మే 27నుంచి మొదలుకావాల్సి ఉంది. అంటే అత్యంత తీవ్రమైన ఎండలు మొదలుకావడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది. కానీ, ఇప్పటికే రుతుపవనాలు పలకరించాయి. 2020 నుంచి ఏటా రోహిణి కార్తె మే 25నే ప్రారంభమైంది. జూన్ 8 వరకు కొనసాగింది. ఈ లెక్కన ఇప్పుడు మే 27న మొదలై జూన్ 10 వరకు ఉండాలి. కానీ, అసలు రోహిణి కార్తెకు అవకాశమే లేదన్నట్లు ఉంది పరిస్థితి. తెలంగాణ, ఏపీలో ఇప్పటికే వాతావరణం చల్లబడింది. ఖమ్మం వంటి జిల్లాల్లో మే నెలలోనే పదిసార్లకు పైగా అకాల వర్షం కురిసింది. ఇక రుతు పవనాలు కూడా వచ్చేసినందున ఇక రోహిణి కార్తె లేనట్లే అని అంటున్నారు.
అయితే అటు.. లేకపోతే ఇటు..
రోళ్లు పగిలే రోహిణి కార్తె అని చెబుతున్నప్పటికీ దీనికి కొంత రిలాక్సేషన్ కూడా ఉంటుందని పెద్దలు ఇదివరకు చెప్పేవారు. ఈ కార్తెలో ఉంటే గింగే ఎండలు అత్యంత తీవ్రంగా ఉంటాయని.. లేదంటే వర్షాలు వచ్చేస్తాయని బామ్మలు, తాతయ్యలు కథలుగా చెప్పేవారు. మరి ఈ ఏడాది.. రోళ్లు పగిలే ఎండలు లేనట్లే అనుకోవాలేమో?