Begin typing your search above and press return to search.

విశాఖలో స్కూల్‌ ఆటో-లారీ ఢీ... 8 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు!

రోడ్డు ప్రయాణాల విషయంలో పూర్తి సృహలో, పూర్తి జాగ్రత్తతో ఉండని పక్షంలో జరిగే ప్రమాదాలు పూడ్చలేని నష్టాన్ని మిగులుస్తాయనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   22 Nov 2023 8:50 AM GMT
విశాఖలో స్కూల్‌ ఆటో-లారీ ఢీ... 8 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు!
X

రోడ్డు ప్రయాణాల విషయంలో పూర్తి సృహలో, పూర్తి జాగ్రత్తతో ఉండని పక్షంలో జరిగే ప్రమాదాలు పూడ్చలేని నష్టాన్ని మిగులుస్తాయనేది తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలను తీసుకునివెళ్లే మినీ బస్సులు, ఆటోల విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా స్కూల్ ఆటో - లారీ ఢీకొన్నాయి.

అవును... విశాఖలోని సంగం శరత్‌ థియేటర్‌ సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా స్కూల్‌ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో - లారీ ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రియాక్ట్ అయిన స్థానికులు ఆ స్కూలు పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరార్‌ అయిపోగా... స్థానికులు క్లీనర్‌ ను మాత్రం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు.... హాసిని ప్రియా, వాణి జయ రమ్య, భవేష్‌, జీ.గాయత్రి, లక్ష్య, కుశాల్ కేజీ, చార్విక్‌, కేయూష్ లుగా చెబుతున్నారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు!

ఈ ప్రమాదంపై ట్రాఫిక్‌ ఏసీపీ రాజీవ్‌ కుమార్‌ స్పందించారు. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఆ ఆటోలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారని.. వారంతా బేతని స్కూల్‌ కు చెందిన వాళ్లని అన్నారు. ముఖ్యంగా... ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్ళు తెలిపారు.

ఇదే రోజు విశాఖలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇది కూడా స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదం కావడం గమనార్హం. ఈ ఘటనలో మధురవాడ - నగరంపాలెం రోడ్డులో ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి. మధురవాడ నుంచి వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఆటోలో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తుంది. వారందరూ స్వల్పంగా గాయపడ్డారని సమాచారం!