Begin typing your search above and press return to search.

ఓ.ఆర్.ఆర్. మెట్రో విస్తరణ... రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం?

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 6:49 AM GMT
ఓ.ఆర్.ఆర్. మెట్రో విస్తరణ... రేవంత్  రెడ్డి సంచలన నిర్ణయం?
X

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రక్షాళ, ఐపీఎస్ ల బదిలీలతో పాటు అన్ని శాఖల్లోనూ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు స్పష్టం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తుంది. ఈ సమయంలో ఓ.ఆర్.ఆర్. మెట్రో విస్తరణ విషయంలో రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది!

అవును... తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో ముందుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీఆరెస్స్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన అవుటర్ రింగ్ రోడ్ మెట్రో ప్రాజెక్టును రేవంత్ రెడ్డి రద్దు చేసేందుకు మెుగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.

దీంతో... ఇది సంచలన నిర్ణయమే అని అంటున్నారు పరిశీలకులు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరం చుట్టూ మెట్రో రైల్ సేవలు విస్తరించాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ రూ.69 వేల కోట్లతో మెట్రో ప్రాజెక్టును విస్తరించేందుకు నాటి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పనులకు నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. ప్రస్తుతం ఆ భారీ ప్రాజెక్టు టెండర్ల దశలో ఉంది.

నాటి కేబినెట్ నిర్ణయం ప్రకారం... పటాన్‌ చెరు - నార్సింగ్‌ వరకు 22 కిలోమీటర్లు.. తుక్కుగూడ, పెద్ద అంబర్‌ పేట వరకు 40 కిలోమీటర్లు మెట్రో కారిడార్‌ ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో అటు తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కి.మీ.. మేడ్చల్‌ నుంచి పటాన్‌ చెరు వరకు 29 కిలోమీటర్లు కారిడార్‌ విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమయంలో ఆ కీలక నిర్ణయానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేకులు వేయనున్నారని అంటున్నారు. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యేలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి... పలు అభివృద్ధి పనులపై వారితో చర్చించారని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఓ.ఆర్.ఆర్. మెట్రో విస్తరణ ప్రాజెక్టు అంశం కూడా వీరిమధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో ఆ ప్రాజెక్ట్ అవసరం లేదనే ఆలోచన వచ్చిందని తెలుస్తుంది!

ఇందులో భాగంగా... ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణ అవసరం లేదని.. అది కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకు తీసుకున్న నిర్ణయమని.. అందువల్ల ఆ ప్రాజెక్టుకు రద్దు చేసి.. ఓల్డ్ సిటీని ఎయిర్ పోర్ట్ కు అనుసంధానం చేస్తే బెటర్ అనే ఆలోచన రేవంత్ చేస్తున్నారని, ఇది సహేతుకంగా ఉంటుందని భావిస్తున్నారని సమాచారం.

ఈ క్రమంలో ప్రస్తుతం పెండింగ్‌ లో ఉన్న జేబీఎస్ - ఫలక్‌ నుమా కారిడార్‌ ను పూర్తి చేసి, పహాడీ షరీఫ్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ మెట్రోను విస్తరించాలని భావిస్తున్నారట. అలా... రాయదుర్గం - శంషాబాద్ విమానాశ్రయం మార్గాన్ని రద్దు చేసి, ఈ మార్గాన్ని ఎంచుకోవటం ద్వారా ఓల్డ్ సిటీ కూడా కవర్ అవుతుందని ఇది చాలా మందికి ఉపయోగంగా ఉంటందని సీఎం రేవంత్ భావిస్తున్నారని అంటున్నారు!