పనిలేని వాళ్లే మమ్మల్ని విమర్శిస్తున్నారు: రేవంత్రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ దివాలా తీస్తోందన్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు.
By: Tupaki Desk | 17 May 2025 10:56 AMతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ దివాలా తీస్తోందన్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నా మని.. దీంతో ఆ సంస్థకు ఇప్పటి వరకు 5200 కోట్ల రూపాయలను చెల్లించామని చెప్పారు. దీంతో ఆర్టీసీ పుంజు కుందని తెలిపారు. పనిలేని వాళ్లే తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా జేఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎప్పుడూ గౌరవం ఇస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ ద్వారా మహిళా శక్తి ఈ దేశానికి, ప్రపంచానికి కూడా తెలిసి వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మహి ళలకు అత్యంత గౌరవం ఇస్తోందన్నారు. ఉచిత పథకాలన్నీ మహిళలకే అందిస్తున్నామన్నారు. పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ అంటే.. అదానీ, అంబానీ మాత్రమే గుర్తుకు వచ్చేశారని అన్నారు. కానీ, ఇప్పుడు వాటిని కూడా మహిళలకు అప్పగించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
ఇందిరమ్మ హయాంలో మహిళలకు మేలు చేసేలా అనేక చట్టాలు తెచ్చారని తెలిపారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రంలోనూ మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పాఠశాలల నిర్వహణను కూడా మహిళలకే అప్పగించినట్టు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు.
హైటెక్ సిటీలో మూడున్నర ఎకరాల స్థలాన్ని మహిళా సంఘాలకు కేటాయించినట్టు సీఎం వివరించారు. అదేవిధంగా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. రాజకీయంగా కూడా మహిళలను ప్రోత్సహిస్తున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు.