Begin typing your search above and press return to search.

నేల‌పై కూర్చుని.. కోటా బియ్యం భోజ‌నం చేసిన రేవంత్.. సింప్లిసిటీకి ప్ర‌శంస‌లు

ఆయ‌న రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి. కోరుకున్నవ‌న్నీ చేతి వ‌ద్ద‌కే వ‌స్తాయి. కానీ, అలా చేయ‌లేదు. సామాన్యుల‌లో సామాన్యుడిగా క‌లిసి పోయారు.

By:  Tupaki Desk   |   7 April 2025 3:25 AM
నేల‌పై కూర్చుని..  కోటా బియ్యం భోజ‌నం చేసిన రేవంత్.. సింప్లిసిటీకి ప్ర‌శంస‌లు
X

ఆయ‌న రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి. కోరుకున్నవ‌న్నీ చేతి వ‌ద్ద‌కే వ‌స్తాయి. కానీ, అలా చేయ‌లేదు. సామాన్యుల‌లో సామాన్యుడిగా క‌లిసి పోయారు. త‌న అధికారం, ద‌ర్పం, ముఖ్య‌మంత్రి హోదా.. కీల‌క పార్టీ నాయ‌కుడు.. ఇలా అన్ని ద‌ర్పాల‌ను ప‌క్క‌న పెట్టారు. పేద‌ల కుటుంబంతో క‌లిసి క‌టిక నేల‌పై కూర్చుని.. వారితో క‌లిసి కోటా బియ్యంతో వంటిన భోజ‌నం చేశారు. ఆయ‌నే తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి. తాజాగా రాష్ట్రంలో బియ్యం వివాదం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. స‌న్న‌బియ్యాన్ని తామే ఇచ్చామ‌ని బీజేపీ చెబుతోంది. కానీ, తామే ఇస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి స‌ర్కారు ఎదురు దాడి చేస్తోంది.

ఒక‌వేళ స‌న్న‌బియ్యాన్ని కేంద్రం ఇచ్చి వుంటే.. దేశ‌వ్యాప్తంగా ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని కూడా మంత్రి ఉత్త‌మ్ స‌హా.. ప‌లువురు నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డి.. ప్ర‌భుత్వం ఇస్తున్న స‌న్న‌బియ్యంతో వండి భోజ‌నాన్ని రుచి చూశారు. ఆదివారం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా భ‌ద్రాచ‌లానికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. భ‌ద్రాచ‌లంలోని సీతారామ చంద్ర‌మూర్తి ఆల‌యంలో జ‌రిగిన‌ క‌ల్యాణ మహోత్స‌వంలో పాల్గొన్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అనంత‌రం.. కొద్దిసేపు అక్క‌డే ఉన్న రేవంత్ రెడ్డి.. అనంత‌రం.. స‌మీపంలో ని సార‌పాక గ్రామానికి వెళ్లారు.

ఈ గ్రామంలో చాలా మంది రేష‌న్ కార్డులు దారులే ఉన్నారు. వీరి కుటుంబాల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ల‌బ్ధిదారులు ల‌క్ష‌ణ్ స్వామి ఇంట్లో రేవంత్రెడ్డి భోజ‌నం చేశారు. అయితే.. ఆయ‌న వ‌స్తార‌ని ముందుగా స‌మాచారం లేక‌పోవ‌డంతో ఎలాంటి ఏర్పాట్లు చేయ‌లేదు. కేవ‌లం 15 నిమిషాల ముందు మాత్ర‌మే రేవంత్ రెడ్డి గ్రామానికి వ‌స్తున్న‌ట్టు స‌మాచారం వ‌చ్చింది. దీంతో ల‌బ్ధిదారుని కుటుంబం ఎదురేగి ఆయ‌న కు హాజ‌రుతులు ఇచ్చి ఇంట్లోకి సాద‌రంగా ఆహ్వానించింది. అనంత‌రం.. వారి ఇంట్లో రేష‌న్ కోటా కింద ఇచ్చిన స‌న్న బియ్యంతో చేసిన ఆహారాన్ని అక్క‌డే క‌టిక నేల‌పై కూర్చుని రేవంత్ రెడ్డి ఆర‌గించారు.

ఈ సంద‌ర్భంగా వారి క‌ష్టాలు, సుఖాలు తెలుసుకున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి సింప్లిసిటీకి నెటిజ‌న్ల నుంచి మంచి మార్కులు ప‌డ్డాయి. సాదార‌ణంగా.. టేబుల్‌పైనే భోజ‌నం చేసే అల‌వాటు ఉన్న ఈ రోజుల్లో ముఖ్య‌మంత్రి హోదాను కూడా మ‌రిచి సీఎం రేవంత్ నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డాన్ని చాలామంది ప్ర‌శంసించారు. కాగా.. దీనిని బీజేపీ నాయ‌కులు తోసిపుచ్చారు. ``ఇది స‌న్న‌బియ్యం స్టంట్`` అని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ విమ‌ర్శించారు. ప‌విత్ర‌మైన రాముల వారి క‌ళ్యాణానికి వెళ్లి.. రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆరోపించారు.