Begin typing your search above and press return to search.

మోడీకి 'త‌మ్ముడి' విన‌తులు.. మ‌ళ్లీ-మ‌ళ్లీ: బీఆర్ఎస్‌

ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీని.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి విన‌తుల‌పై వినతుల‌తో అభ్య‌ర్థించారు.

By:  Tupaki Desk   |   24 May 2025 6:30 PM
మోడీకి త‌మ్ముడి విన‌తులు.. మ‌ళ్లీ-మ‌ళ్లీ: బీఆర్ఎస్‌
X

ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీని.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి విన‌తుల‌పై వినతుల‌తో అభ్య‌ర్థించారు. మోడీని ఆయ‌న `పెద్ద‌న్న‌య్య‌` అని సంబోధించిన నేప‌థ్యంలో తాజాగా బీఆర్ ఎస్ నాయ‌కులు `మోడీ త‌మ్ముడు`అంటూ సీఎం రేవంత్ రెడ్డిని సంబోధిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మోడీని త‌మ్ముడు మ‌ళ్లీ మ‌ళ్లీ అభ్య‌ర్థిస్తున్నాడ‌ని.. అయినా.. ఏమాత్రం అక్క‌డ‌(కేంద్రం) నుంచి ఎలాంటి సాయం అంద‌డం లేద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో నీతి ఆయోగ్ స‌మావేశం జ‌రిగింది. దీనికి దేశ‌వ్యాప్తంగా ముఖ్య‌మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు హాజ‌ర‌య్యారు.

ఈ క్ర‌మంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజ‌రై.. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను వివ‌రించారు. అంతేకాదు.. తెలంగాణ `ఖ‌ద్ద‌ర్‌`తో త‌యారు చేసిన దుస్తుల‌ను కూడా ఆయ‌నకు బ‌హూక‌రించారు. ప్ర‌త్యేకంగా స‌మావేశం కూడా నిర్వ‌హిం చారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై స‌హ‌క‌రించాల‌ని ప్ర‌ధానిని ముఖ్య‌మంత్రి కోరారు. వీటిలో.. హైద‌రాబాద్ మెట్రో, రింగ్ రోడ్డు నార్త్, సౌత్ నిర్మాణాలు, గ్రీన్ ఫీల్డ్ రైల్వే లైన్ వంటివి ఉన్నాయి. అదేవిధంగా కీల‌క‌మైన డ్రైపోర్టు నిర్మాణ అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌ధానిని కోరారు. ఈ డ్రైపోర్టును మచిలీపట్నం పోర్టుకు అనుసంధానానికి గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్‌ రైల్వేలైన్ ఏర్పాటుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

అయితే.. వీటిని సావ‌ధానంగా చిక్క‌టి చిరున‌వ్వుతో ఆల‌కించిన ప్ర‌ధాని షేక్ హ్యాండ్ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డిని సంతృప్తి ప‌రిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలోనూ.. అధికారిక తెలంగాణ సోష‌ల్ మీడియా ఖాతాల్లోనూ వైర‌ల్ అయ్యాయి. వీటిని చూసిన బీఆర్ ఎస్ నాయ‌కులు.. `అన్న‌య్య‌కు త‌మ్ముడి అభ్య‌ర్థ‌న‌లు` అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక‌, గ‌తంలోనూ అనేక సంద‌ర్భాల్లో ప్ర‌త్యేకంగా ప్ర‌ధానిని క‌లిసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి సాయం చేయాల‌ని అభ్య‌ర్థించారు. ప‌లుప్రాజెక్టుల‌ను కూడా ఆయ‌నకు వివ‌రించారు. ముఖ్యంగా మూసీ న‌ది మర‌మ్మ‌తులు.. పున‌ర్నిర్మాణానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి రూపాయి కూడా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్పుడు చేసిన విన‌తులు ఏమేర‌కు ఫ‌లిస్తాయోన‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాలు సంధిస్తున్న ప్ర‌శ్న‌.