సీఎంవో ప్రక్షాళన.. రేవంత్ కీలక నిర్ణయాలు
అనుకుంటాం కానీ ప్రభుత్వాన్ని నడపటం అంత తేలికైన విషయం కాదు. అధికారం చేతికి వచ్చినంతనే అబ్రకదబ్ర అన్నంత తేలిగ్గా.. మార్పులు చోటు చేసుకోవటం సాధ్యం కాదు.
By: Tupaki Desk | 1 May 2025 5:00 AMఅనుకుంటాం కానీ ప్రభుత్వాన్ని నడపటం అంత తేలికైన విషయం కాదు. అధికారం చేతికి వచ్చినంతనే అబ్రకదబ్ర అన్నంత తేలిగ్గా.. మార్పులు చోటు చేసుకోవటం సాధ్యం కాదు. ఒకటి తర్వాత ఒకటిగా మార్పులు చేసుకుంటూ పోవాలి. తనదైన టీంను సెట్ చేసుకోవటానికి చాలానే సమయం తీసుకుంటుంది. ఇందుకు రేవంత్ ప్రభుత్వమే ఉదాహరణ. పదేళ్లు సాగిన కేసీఆర్ సర్కారు అనంతరం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని దక్కించుకున్న రేవంత్.. గడిచిన ఏడాదిన్నరగా పాలన మీద పట్టుకోసం కిందా మీదా పడుతున్నారు.
తాజాగా ఆయన తన సొంత కార్యాలయాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు అనుగుణంగా సీఎంవోలో మార్పులు చేర్పులకు సంబంధించిన నిర్ణయాల్ని వడివడిగా తీసుకుంటున్నారు. ఇంతకాలంగా సీఎంవోలో మార్పుల విషయంలో పెద్ద నిర్ణయాల్ని తీసుకొని సీఎం రేవంత్.. ఇప్పుడు అందుకు భిన్నంగా తనదైన టీం కోసం ఫోకస్ చేస్తున్నట్లుగా చెప్పాలి. గత వారం (ఏప్రిల్ 27) 18 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన ఆయన.. కీలక శాఖలకు కొత్త అధిపతుల్ని నియమించటం తెలిసిందే.
రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి సీఎం సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించిన సంగీత సత్యనారాయణను వైద్యరోగ్య శాఖ డైరెక్టర్ గా.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా బదిలీ చేశారు. సీఎంవోలో ఆమె వైద్యరోగ్య.. స్త్రీ శిశు సంక్షేమం.. ఎస్సీల డెవలప్ మెంట్ తో పాటు గిరిజన సంక్షేమ శాఖల వ్యవహారాల్ని పర్యవేక్షించేవారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర పరిశ్రమలు.. ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జయేశ్ రంజన్ ను సీఎంవోకి తీసుకున్నారు. ఆయనకు కీలకమైన పరిశ్రమలు.. పెట్టుబడులతో పాటు మరికొన్ని కీలక బాధ్యతలు అప్పజెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు సీఎంవో నుంచే ప్రయత్నాలు చేసేందుకు వీలుగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పజెప్పినట్లుగా చెప్పాలి. సీఎం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని త్వరలో రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ గా నియమించనున్నారు. మరో మూడు నెలల్లో ఆయన రిటైర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన సీఎంవోలో అటవీ.. వ్యవసాయం.. పశుసంవర్ధక.. పౌరసరఫరాలు.. రవాణా.. ఆర్ అండ్ బీ.. పంచాయితీరాజ్.. గ్రామీణాభివ్రద్ధి శాఖల వ్యవహరాల్ని చూస్తున్నారు. సీఎం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న షానవాజ్ ఖాసింకు ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. బుధవారం ఒక ఆసక్తికర ఉత్తర్వు జారీ అయ్యింది. అదేమంటే.. టీటీడీలో సుదీర్ఘకాలం పాటు జేఈవోగా వ్యవహరించిన కేఎస్ శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.రిటైర్ అయిన ఆయన..ఈ పదవిలో రెండేళ్లు ఉండనున్నారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని కంటిన్యూ చేస్తారని చెబుతున్నారు. సీఎంకార్యదర్శి మాణిక్ రాజ్ కీలక శాఖల్ని పర్యవేక్షిస్తున్నారు. సీఎంకు సన్నిహితంగా ఉండే అజిత్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం ఓఎస్డీ హోదాలోవేముల శ్రీనివాసులు ఉన్నారు. వీరంతా స్థాన చలనం లేకుండా కంటిన్యూ అవుతారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. సీఎంవోలో కీలక మార్పులు చేపట్టినట్లుగా చెప్పాలి.