వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ లో బాబు రీ సౌండ్!
ఏపీలో వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతం ఏంటి అని అడిగితే ఎవరైనా ఠక్కున చెప్పే జవాబు రాయలసీమ అనే.
By: Tupaki Desk | 18 May 2025 5:26 PMఏపీలో వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతం ఏంటి అని అడిగితే ఎవరైనా ఠక్కున చెప్పే జవాబు రాయలసీమ అనే. వైసీపీకి 2014, 2019లలో రాయలసీమ ఇచ్చిన ఊతం మరే చోటా కనిపించలేదు. అయితే 2024 నాటికి బొమ్మ తిరగబడింది. దానికి కారణం ఒక బలమైన సామాజిక వర్గం అలాగే వైసీపీకి ఓటు బ్యాంక్ గా ఉన్న ఒక కీలక వర్గంలో చీలిక వంటివి ప్రధాన కారణాఉగా కనిపిస్తాయి.
అయినా సరే రాయలసీమలో వైసీపీకి బాగానే ఓట్లు వచ్చాయి. అనేక చోట్ల తక్కువ మెజారిటీతో సీట్లను కోల్పోయారు. ఇక వైసీపీ ఇపుడు విపక్షంలో ఉంది. పైగా ఆ పార్టీ అధినేత జగన్ కడప బిడ్డ. వైఎస్సార్ వారసుడు. దాంతో సీమలో వైసీపీకి పునరుత్తేజం కలగడం అన్నది ఆ పార్టీ గట్టిగా కష్టపడితే జరిగే పరిణామం అని అంటున్నారు.
దాంతో వైసీపీకి బలమైన హార్డ్ కోర్ రీజియన్ పైనే చంద్రబాబు ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. ఆయన ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళి హంద్రీ నీవా పనులను పరిశీలించారు. జూన్ నాటికి మొదటి దశను పూర్తి చేస్తామన్ చెప్పారు. లేటెస్ట్ గా ఆయన కర్నూల్ జిల్లా పర్యటన చేశారు.
ఈ సందర్భంగా జనాలతో మమేకం అయ్యాయి. వివిధ వర్గాల వారి నుంచి అభిప్రాయలను తీసుకున్నారు. ఈ నేపధ్యంలో బాబు అన్న మాటలు ఇపుడు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తునాయి. బాబు రాజకీయ చరిత్రలో ఎపుడూ ఒక కులం అని ప్రాంతం అని క్లెయిం చేసుకున్న సందర్భాలు అయితే పెద్దగా లేవు అని అంటారు.
కానీ కర్నూల్ టూర్ లో బాబు తాను కూడా రాయలసీమ బిడ్డనే అని రీ సౌండ్ చేశారు. తనకు ప్రాంతం మీద ప్రేమ ఉండబట్టే తన హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశాను అని చెప్పారు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్న నాటి నుంచి సీమ మీద ప్రత్యేక దృష్టిని పెట్టానని చెప్పారు. సీమ అంటే ఫ్యాక్షనిజం మాత్రమే ఉందని సినిమాల్లో చూపిస్తూ వచ్చేవారని ఆ కల్చర్ ని తాను కూకటి వేళ్ళతో పెకిలించాను అని ఆయన అన్నారు.
అదే విధంగా తాను సీమ ప్రగతి కోసం ఎంతో చేశాను అని చెప్పారు రాయలసీమలో నాలుగు ఎయిర్ పోర్టులు ఉన్నాయని గుర్తు చేశారు. అంతే కాదు సీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గత వైసీపీ అయిదేళ్ళ పాలనలో సీమలో గుంతల రోడ్లను పూడ్చేందుకు కూడా అవకాశం లేదని బాబు విమర్శించారు.
ఇక తమ పాలనలో పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని కూడా పేర్కొన్నారు. సీమ కోసం ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తుందని బాబు చెబుతున్నారు. రాయలసీమలో 2024 ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. చంద్రబాబు హయాంలో తొలిసారి సీమలో అన్ని సీట్లు సాధించారు.
సీమ వాసులు ఎన్ టీఆర్ ని దత్తపుత్రుడుగా భావించారు. అన్న గారి నాయకత్వంలో టీడీపీ పోటీ చేసిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ఎన్నికల్లో సీమలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అన్న గారు కోస్తా జిల్లా వాసులు అయినా సీమ జనం ఎంతో ఆదరించింది. ఇక చంద్రబాబు విషయంలో మాత్రం అనుకున్నంత ఆదరణ టీడీపీకి ఎపుడూ దక్కలేదు.
దానికి భిన్నగా 2024 ఎన్నికల ఫలితాలు టీడీపీ ప్రభంజనాన్ని చూపించాయి. దాంతో పాటు వైసీపీ పూర్తిగా దెబ్బ తింది. దాంతో ఈ ఆదరణను పార్టీకి శాశ్వతం చేసుకోవాలన్న ఆలోచనతో బాబు సీమ బిడ్డను అంటూ రీ సౌండ్ చేస్తున్నారు. మరి సీమ జనాలు టీడీపీని ఏ విధంగా చూస్తారు అన్నది రాబోయే కాలంలో తేలనుంది అని అంటున్నారు.