Begin typing your search above and press return to search.

పెద్దాయన రాయలసీమ గళం విప్పుతారా ?

ఏపీలో అతి ముఖ్యమైన రీజియన్ గా రాయలసీమ ఉంది. రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి మద్రాస్ స్టేట్ లో ఉండేది.

By:  Satya P   |   11 July 2026 7:00 PM IST
పెద్దాయన రాయలసీమ గళం విప్పుతారా ?
X

ఏపీలో అతి ముఖ్యమైన రీజియన్ గా రాయలసీమ ఉంది. రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి మద్రాస్ స్టేట్ లో ఉండేది. అయితే ప్రత్యేక రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవించాలనుకున్నపుడు మొదట్లో రాయలసీమ కలసిరాలేదు. మాకు మద్రాస్ స్టేట్ తో బాగానే ఉంది అని కూడా అనుకుంది. చివరికి శ్రీభాగ్ ఒప్పందం మేరకు రాయలసీమ కూడా కలసి వచ్చింది. దాని ప్రకారం చూస్తే కొత్త స్టేట్ లో రాజధాని అయినా లేదా హైకోర్టు అయినా తమకు ఉండాలని కోరినట్లుగా ఒప్పందంలో ఉంది. ఇక 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు కర్నూల్ రాజధాని అయింది. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు అయింది. తిరిగి 2014లో ఉమ్మడి ఏపీ విడిపోయినపుడు రాజధాని అయినా హైకోర్టు అయినా ఏదో ఒకటి దక్కాలని అనుకున్న అది జరగలేదు. అయితే కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అంతే కాదు రాయలసీమను రతనాల సీమను చేస్తామని కూడా చెబుతూ ఆ దిశగా చర్యలను చేపడుతోంది.

సాగు నీటి ప్రాజెక్టులు :

అదే విధంగా చూస్తే రాయలసీమకు సాగు తాగు నీటి కొరత ఉంది. వాటి విషయంలో పాలకులు ఆలోచన చేయాలని కూడా ఉంది. అలాగే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఉపాధి అవకాశాలు మాత్రం పెద్దగా పెరగడం లేదు. అదే సమయంలో పరిశ్రమలు వస్తున్నాయని అంటున్నా రాయలసీమలో అనేక సమస్యలు ఉన్నాయని అంటున్నారు. దాంతో రాయలసీమ విషయంలో ఇంకా అసంతృప్తి స్వరాలు గట్టిగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి మైసూరారెడ్డి అయితే రాయలసీమ విషయంలో తన స్థిరరమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక యూ ట్యూబ్ చానల్ లో ఆయన మాట్లాడుతూ రాయలసీమకు తగిన న్యాయం జరగాలని కోరుకున్నారు.

ఇద్దరూ ఏమీ చేయలేదు :

రాయలసీమ ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ మాజీ సీఎం వైఎస్ జగన్ కానీ ఏమీ చేయలేదని మైసూరారెడ్డి విమర్శించారు. రాయలసీమలో అనేక సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. వాటి కోసం అంతా కృషి చేయాలని పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే రాయలసీమ సమస్యల పట్ల మళ్ళీ తన గళాన్ని వినిపించాలని మైసూరారెడ్డి ఆలోచిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. రాయలసీమ అభివృద్ధి మీద అయితే ఇప్పటికీ అంతా అసంతృప్తిగానే ఉన్నారు. పాలకులు మారినా ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా వెనకబాటు తనం పోవడం లేదన్న బాధ అయితే అందరిలో ఉంది.

రాజకీయాలకు దూరంగా :

ఇక మైసూరారెడ్డి చూస్తే రాజకీయాలకు దూరంగానే ఉంటూ వతున్నారు. ఆయన రాజకీయ జీవితం బాగా వెలిగింది కాంగ్రెస్ పార్టీలోనే అని గుర్తు చేస్తున్నారు. 1983 నుంచి మూడు సార్లు వరసగా కమలాపురం నుంచి గెలిచిన మైసూరారెడ్డి నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా పనిచేశారు. ఆ తరువాత మూడున్నర దశాబ్దలౌగా చూస్తే ఆయన రాజకీయంగా కీలక పదవులలో లేరు. మధ్యలో టీడీపీలో చేరి ఒకసారి రాజ్యసభకు వెళ్ళారు. వైసీపీలో చేరినా ఆయనకు అధికార పదవులు దక్కలేదు. మొత్తానికి పదేళ్ళుగా రాజకీయాలు దూరంగా ఉంటున్న ఆయన రాయలసీమ సమస్యల మీద ఉద్యమించేందుకు సిద్ధపడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. మరి ఆయన కనుక రంగంలోకి దిగితే రాజకీయం అక్కడ ఏ విధంగా మారుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.