రామ్మోహన్ కి బయట పల్లకీ మోత...ఇంట్లో మాత్రం !
దిగ్గజ నేత దివంగతులైన కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడుగా మూడు పందులు నిండకముందే అరంగేట్రం చేసి మూడు సార్లు ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించిన వారు కింజరాపు రామ్మోహన్ నాయుడు.
By: Tupaki Desk | 18 April 2025 3:30 PMదిగ్గజ నేత దివంగతులైన కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడుగా మూడు పందులు నిండకముందే అరంగేట్రం చేసి మూడు సార్లు ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించిన వారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. నాలుగు పదులు నిండకముందే కేంద్రంలో అత్యంత కీలకమైన పౌర విమాన యాన శాఖ మంత్రిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు.
ఇంకా రాజకీయంగా ఎంతో ఫ్యూచర్ ఉన్న రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రిగా తన పనితీరుతో మెప్పు పొందాల్సిన వేళ ఎండీయే పార్టీ నేతలే ఆయన మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్ర కు చెందిన వారు. అత్యంత వెనకబాటుతనంతో ఉన్న ఈ ప్రాంతంలో విమానా సేవలను మరింతగా విస్తరించాల్సిన కేంద్ర మంత్రి ఉన్నవి తరలిపోతూంటే ఏమి చేస్తున్నారు అని అంతా అంటున్నారు.
ఆయన విమానయాన మంత్రిగా కొత్త సర్వీసులను తీసుకుని రావాల్సి ఉండగా ఉన్నవే పోతున్నాయని అంటున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలే బాహాటంగా కేంద్ర మంత్రి పని తీరు మీద విమర్శలు చేయడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. మామూలుగా అయితే రామ్మోహన్ నాయుడు ఎవరి జోలికీ వెళ్లారు.
తన పనేంటో తానేంటో అనంట్లుగా ఉంటారు. ఆయన పేరులో రాముడు ఉన్నది. అలాగే శ్రీకాకుళం ఎంపీ రాము మంచి బాలుడు అని అంతా అంటారు. తండ్రి పేరు నిలబెడుతూ తెలుగుదేశం పార్టీకి బలమైన భవిష్యత్తు నాయకుడిగా ఉత్తరాంధ్రాలో ఎదుగుతున్న రామ్మోహన్ మీద ఈ కామెంట్స్ రావడంతో ఆయన అభిమానులు అనుచరులు హర్ట్ అవుతున్నారు.
విమాన సేవలు కొన్ని రద్దు కావడం వాస్తవమే అయినప్పటికీ అందులో కేంద్ర మంత్రి ప్రమేయం ఏమి ఉంటుందని అంటున్నారు. ప్రైవేట్ సర్వీస్ ఇస్తున్న వారు వారి డిమాండ్ ని చూసుకుంటారని అంటున్నారు. ఇక కొత్త సర్వీలను తెచ్చేందుకు పౌర విమాన యాన శాఖ కృషి చేస్తూనే ఉంది అని అంటున్నారు.
అయితే విశాఖ వంటి సిటీ నుంచి విజయవాడకు ప్రతీ రోజూ ఉదయం పూట నడిచే రెండు సర్వీసులు రద్దు చేయడం పట్ల చర్చ సాగుతోంది. ఈ విషయంలో పౌర విమాన యాన మంత్రి కూడా ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు ఇదిలా ఉంటే తాజాగా చూస్తే కనుక వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రామ్మోహన్ నాయుడుకు గ్లోబల్ యంగ్ లీడర్స్ 2024 జాబితాలో స్థానం కల్పించింది. అలా చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ప్రభావశీలంగా పనిచేస్తున్న యువ నాయకులను ఈ ఫోరం ఎంపిక చేస్తూ ప్రతి ఏడాది ప్రకటిస్తుంది. ఈసారి భారత్ నుంచి మొత్తం ఏడుగురు ఎంపికయ్యారు.
అందులో ఏపీ నుంచి ప్రత్యేకించి ఉత్తరాంధ్రా నుంచి రామ్మోహన్ నాయుడు ఎంపిక కావడం అందరికీ గర్వకారణం అంటున్నారు. అలాంటి పరిస్థితులలో రామ్మోహన్ నాయుడుకు బయట ఎతో ఆదరణ దక్కుతోంది అదే సమయంలో ఇంట మాత్రం విమర్శలు కొనసాగుతున్నాయని అంటున్నారు. మరి ఇదంతా ఎందుకు వచ్చింది ఎందుకు ఇలా జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా యువ మంత్రిగా సమర్ధంగా పనిచేస్తున్న రామ్మోహన్ నాయుడు సీనియర్ ఎమ్మెల్యేలు అయినా పౌర విమాన యాన సేవలు కోరుకుంటున్న ప్రయాణీకులు అయినా చేసే అభ్యర్ధలను అభ్యంతరాలను సానుకూలంగా తీసుకుని పరిష్కరించాలని అంతా కోరుతున్నారు.