పాక్ తో యుద్ధంపై రాందేవ్ బాబా సంచలనం
పహల్గాం ఉగ్రదాడి అనంతరం.. దీనికి కారణమైన పాకిస్తాన్ సంగతి చూడాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 May 2025 12:07 PMపహల్గాం ఉగ్రదాడి అనంతరం.. దీనికి కారణమైన పాకిస్తాన్ సంగతి చూడాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాన్ని తెలివిగా.. పక్కాగా ప్లాన్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన భారత్.. అందుకు తగ్గట్లు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పాక్ తో యుద్ధం మొదలైతే పాక్ పరిస్థితి ఏమిటి? అన్న దానిపై ఇప్పటికే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి వేళ ప్రముఖ యోగా గురువు.. పతంజలి బ్రాండ్ కు అన్నీ తానైన బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అన్నది మొదలైతే పాక్ పరిస్థితి దారుణంగా మారుతుందని రాందేవ్ బాబా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న పాక్ తనంతట తాను విచ్చిన్నమవుతుందన్నారు. బలూచ్ ప్రజల స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేస్తున్నట్లుగా పేర్కొన్న ఆయన.. పాక్ అక్రమిత కశ్మీర్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు.
‘పాక్ కు పోరాడే శక్తి లేదు. భారత్ తో యుద్ధం జరిగితే ఆ దేశం నాలుగు రోజులు కూడా నిలవలేదు’ అంటూ ఎద్దేవా చేయటమే కాదు.. మరికొన్ని రోజుల్లో మనం కరాచీ.. లాహోర్ లలో గురుకులాల్ని నిర్మించాల్సి ఉంటుందని పేర్కొనటం గమనార్హం. పాక్ సైన్యంపై దాయాది విశ్వాసం కోల్పోయిందన్న ఆయన.. భారత్ చేసే ప్రతీకార దాడుల గురించి ఆ దేశనాయకులు భయపడుతున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా.. నక్కజిత్తుల పాక్ విషయంలో శ్రుతి మించిన ఆత్మవిశ్వాసం ఎంత మాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.