Begin typing your search above and press return to search.

పాక్ ఆక్రమిత కశ్మీర్ కావాలన్న గురువు.. ఆర్మీ చీఫ్ ఏమన్నారంటే?

జగద్గురు రామభద్రాచార్య తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని ధృవీకరిస్తూ... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తులసి పీఠ్ ధామ్‌లోని తనను సందర్శించారని

By:  Tupaki Desk   |   30 May 2025 10:30 PM
పాక్ ఆక్రమిత కశ్మీర్ కావాలన్న గురువు.. ఆర్మీ చీఫ్ ఏమన్నారంటే?
X

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మ విభూషణ్ జగద్గురు స్వామి రామభద్రాచార్య చేసిన సంచలన డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మధ్యప్రదేశ్ చిత్రకూట్‌లోని రామభద్రాచార్య ఆశ్రమాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకున్న సందర్భంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

ఆర్మీ చీఫ్ ద్వివేది ఆశ్రమానికి వచ్చినప్పుడు, రామభద్రాచార్య ఆయనకు "రామ మంత్రాన్ని" ఉపదేశించారు. ఈ మంత్రాన్ని లంకపై యుద్ధానికి వెళ్లే ముందు సీతాదేవి హనుమంతుడికి ఉపదేశించిందని రామభద్రాచార్య వివరించారు. ఆ తర్వాత గురు దక్షిణ ప్రస్తావన రాగా, తనకు గురు దక్షిణగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) కావాలని రామభద్రాచార్య ఆర్మీ చీఫ్ ద్వివేదిని అడిగారు. దీనికి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సానుకూలంగా స్పందించినట్లు రామభద్రాచార్య పేర్కొన్నారు. "పాకిస్థాన్‌కు సరైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం" అని ఆర్మీ చీఫ్ చెప్పినట్లు ఆయన తెలిపారు.

జగద్గురు రామభద్రాచార్య తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని ధృవీకరిస్తూ... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తులసి పీఠ్ ధామ్‌లోని తనను సందర్శించారని, సాధువులు, విద్యార్థులతో సమావేశమై భారత సైన్యం గొప్పతనాన్ని వివరించారని పోస్ట్ చేశారు.

- ఎవరీ రామభద్రాచార్య?

జగద్గురు రామభద్రాచార్య భారతదేశంలో సుపరిచితుడైన ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు, తత్వవేత్త. అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు మధ్య జరిగిన న్యాయ పోరాటంలో ఆయన పాత్ర చాలా కీలకం. శ్రీరాముడి జన్మభూమి అయోధ్యే అని అలహాబాద్ హైకోర్టు ముందు నిరూపించడానికి ఆయన అనేక శాస్త్రీయ ఆధారాలను, గ్రంథాలను ధర్మాసనం ముందుంచారు. ఆయన సమర్పించిన అఫిడవిట్, ఆధారాలు తుది తీర్పు వెల్లడించడంలో కీలకమయ్యాయి. చిన్నతనంలోనే దృష్టిని కోల్పోయినా, అద్భుతమైన విజ్ఞానంతో శాస్త్రాలు, తత్వాలు, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణంపై విస్తృతంగా రచనలు చేశారు. ఆయన స్థాపించిన తులసీ పీఠం ఆశ్రమం విద్య, సంస్కృతి, సేవా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.

-పీఓకేపై పెరుగుతున్న డిమాండ్లు:

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత భూభాగంలో తిరిగి విలీనం కావాలని రామభద్రాచార్య మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక వర్గాల నుండి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇటీవలే మే 29న జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పీఓకేను తిరిగి తీసుకోవడంపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఏదో ఒక రోజు పీఓకేను భారత భూభాగంలో కలిపేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిణామాల మధ్య ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం, దానికి ప్రతీకారంగా భారత్ "ఆపరేషన్ సింధూర్" చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను కూల్చివేయడం, ఈ దాడిలో దాదాపు 200 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు రక్షణ శాఖ పేర్కొనడం వంటివి పీఓకే అంశాన్ని మరింత ముందుకు తెచ్చాయి. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక గురువు డిమాండ్, ఆర్మీ చీఫ్ సానుకూలత దేశ భద్రత, సమగ్రత పట్ల భారత ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి.