Begin typing your search above and press return to search.

ఇకపై రెడ్డి దొరల రాజ్యమా... రేవంత్ పై రాకేష్ హాట్ కామెంట్స్!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆరెస్స్ నేతల మధ్య వాడీ వేడీ చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Dec 2023 7:00 AM GMT
ఇకపై రెడ్డి దొరల రాజ్యమా... రేవంత్ పై రాకేష్  హాట్  కామెంట్స్!
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆరెస్స్ నేతల మధ్య వాడీ వేడీ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. శ్వేతపత్రం అని ఒకరంటే శ్వేధపత్రం అని మరొకరన్నారు. దీంతో దెబ్బా దెబ్బా అన్నట్లుగా సాగాయి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

అవును... తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాల్లో అధికారులతో రివ్యూలు చేస్తారంటూ రేవంత్ ప్రకటించారని.. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని.. ఆ లెక్కన తాము కూడా మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులతో రివ్యూలు చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

ఇందులో భాగంగా... కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆర్మూర్ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని.. అందువల్ల సీఎం రేవంత్ రెడ్డి, తాను ఇద్దరం సమానమే అని అన్నారు రాకేష్ రెడ్డి. రాజ్యాంగం ప్రకారం ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయని, ఆర్మూర్‌ లో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి వినయ్‌ కుమార్‌ రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గంలో పెత్తనం చేస్తే కుదరదని చెబుతూ స్ట్రాంగ్ గా వార్నింగ్‌ ఇచ్చారు.

ఈ సమయంలో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి తన నియోజకవర్గంలో పెత్తనం చేస్తే కుదరదని.. దొరల రాజ్యం పోయి రెడ్డి దొరల రాజ్యం వచ్చిందంటూ ఘాటు కామెంట్లు చేశారు. వెలమ దొరల రాజ్యం పోయింది.. ఇప్పుడు రెడ్డి దొరల రాజ్యం వచ్చినట్లుంది.. అహంకారం తలకెక్కినట్లుంది అని సంచలన కామెంట్లు చేశారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సి ముఖ్యమంత్రి.. దాన్ని అపహాసం చేయకూడదని తెలిపారు. తమ ఆత్మగౌరవాన్ని దింపిన రోజు.. నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తామని ఈ సందర్భంగా తీవ్ర కామెంట్లు చేశరు. ఈ సందర్భంగా... ఆర్మూర్‌ నియోజకవర్గంలో వేలు పెడితే భద్రం బీకేర్‌ ఫుల్‌ అంటూ కాంగ్రెస్‌ పార్టీ నేత వినయ్‌ కుమార్‌ రెడ్డికి వార్నింగ్‌ ఇచ్చారు రాకేష్‌ రెడ్డి.

కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూరు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పైడి రాకేష్ రెడ్డి... కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిపై 29,669 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ బీఆరెస్స్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యారు.