Begin typing your search above and press return to search.

సంప్రదాయ యుద్ధాలకు కాలం చెల్లింది: ఏఐదే భవిష్యత్తు !

ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు సంప్రదాయ యుద్ధాల స్వరూపాన్ని మార్చేశాయని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.

By:  Tupaki Desk   |   10 April 2025 8:00 PM IST
సంప్రదాయ యుద్ధాలకు కాలం చెల్లింది: ఏఐదే భవిష్యత్తు !
X

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) రాకతో యుద్ధతంత్రాలు పూర్తిగా మారిపోతున్నాయని, ఇది సాంకేతిక యుద్ధానికి దారితీస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజకీయ, సైనిక లక్ష్యాలను చేరుకోవడానికి కొన్ని శక్తులు సైబర్ దాడులను ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నైలోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సైనిక అధికారులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు సంప్రదాయ యుద్ధాల స్వరూపాన్ని మార్చేశాయని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. "అంతకంతకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం మనుషుల ప్రమేయం లేకుండానే పనిచేసే వ్యవస్థలను సృష్టిస్తోంది. అనేక కీలకమైన అంశాలను ఏఐ ముందే ఊహించగలుగుతోంది. ఒకప్పుడు భూమి, నీరు, ఆకాశంపై జరిగే యుద్ధాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఏఐ ప్రవేశంతో ఒక నూతన సాంకేతిక యుద్ధానికి తెరలేచింది" అని ఆయన అన్నారు.

ప్రస్తుతం భారత్ 'గ్రే జోన్',హైబ్రిడ్ యుద్ధ పరిస్థితుల్లో ఉందని ఆయన తెలిపారు. "కొన్ని దుష్ట శక్తులు తమ రాజకీయ, సైనిక ఆధిపత్యాన్ని చెలాయించడానికి సైబర్ దాడులను ఒక ముఖ్యమైన ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఆర్థికపరమైన దాడులు ఒక్క రక్తపు బొట్టు చిందించకుండానే శత్రువుల రాజకీయ, సైనిక లక్ష్యాలను నెరవేర్చగలవు. అందుకే వీటిని ఒక బలమైన సాధనంగా మలుచుకుంటున్నారు. సైబర్, అంతరిక్షం, సమాచార రంగాల్లో జరిగే యుద్ధాలు కూడా సంప్రదాయ యుద్ధాల వలెనే శక్తివంతమైనవి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మన సాయుధ దళాలు బహుళ డొమైన్లలో సమన్వయంతో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది" అని ఆయన నొక్కి చెప్పారు.

మన సరిహద్దు ప్రాంతాల నుండి పరోక్ష యుద్ధం కొనసాగుతోందని, ఉగ్రవాద ముప్పు దీనిని మరింత తీవ్రతరం చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. "సైబర్ దాడుల బారిన పడకుండా ఉండాలంటే మనమందరం ఐక్యంగా పోరాడాలి" అని ఆయన పిలుపునిచ్చారు.