‘హిందూ మతం నుంచి రాహుల్ గాంధీ బహిష్కరిస్తున్నాం’
మంగళవారం ఆయన మాట్లాడుతూ మనుస్మృతిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు.
By: Tupaki Desk | 7 May 2025 5:26 AMకాంగ్రెస్ పార్టీ కీలక నేత.. లోక్ సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరరానంద సరస్వతి ప్రకటించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మనుస్మృతిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. సనాతన ధర్మానికి మనుస్మృతిపై పునాది అని.. లోక్ సభలో మనుస్మృతిని కించపరుస్తూ రాహుల్ గాంధీ మాట్లాడారన్నారు. దీనిపై తాజాగా స్వామిజీ మాట్లాడారు.
మనుస్మృతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఆయన నుంచి తమకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను హిందూ మతం నుంచి లాంఛనంగా బహిష్కరిస్తున్నట్లుగా శంకరాచార్య మఠం బహిష్కరిస్తుందన్నారు. ఇంతకూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారు? అసలు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? అన్నది చూస్తే..
బీజేపీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతూ చేసిన వ్యాఖ్యల్లో మనుస్మృతి ప్రస్తావన ఉంది. ఈ వ్యాఖ్యల్ని ఆయన ఈ జనవరిలో చేశారు. ‘బీజేపీ నేతలు భారత రాజ్యాంగాన్ని కాకుండా మనుస్మృతిని అనుసరిస్తారు. హథ్రాస్ లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని నేను కలుసుకున్నా. బాధిత కుటుంబ సభ్యులు ఇల్లు విడిచి బయటకు వెళ్లలేకపోతున్నారు. కానీ.. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నిందితులు రోడ్లపై స్వేచ్ఛగా తిరగవచ్చని రాజ్యాంగంలో ఎక్కడ రాసుంది? ఇది మీ పుస్తకం మనుస్మృతిపై ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు.
తాజాగా ఈ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ శంకరాచార్య పీఠాధిపతి రాహుల్ గాంధీని హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై హిందూ సంఘాలు.. ఇతర మఠాధిపతులు ఎలా స్పందిస్తారు? దీనికి రాహుల్ రియాక్షన్ ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.