Begin typing your search above and press return to search.

మోడీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. మేడి పండు: ర‌ఘురామ రాజ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

''మోడీ చెబుతున్న‌దంతా ఉత్తుత్తి ప్ర‌చార‌మే'' అని ఒక్క మాట‌లో తేల్చి పారేశారు. దేశ‌ ఆర్థిక వ్యవస్థ దృఢంగా పురోగమిస్తోందనే ప్రచారాన్ని నమ్మ వ‌ద్ద‌న్నారు.

By:  Tupaki Desk   |   27 March 2024 3:30 PM GMT
మోడీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. మేడి పండు:  ర‌ఘురామ రాజ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

కీల‌క‌మైన పార్ల మెంటు ఎన్నిక‌ల‌కు ముందు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత కేంద్ర ప్ర‌భుత్వం స‌హా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెబుతున్న భారత ఆర్థిక వ్య‌వ‌స్థ లేదా మోడీ ఆర్థిక వ్య‌వ‌స్థ మేడి పండును త‌ల‌పిస్తోంద‌ని చెప్పారు. ``మోడీ చెబుతున్న‌దంతా ఉత్తుత్తి ప్ర‌చార‌మే`` అని ఒక్క మాట‌లో తేల్చి పారేశారు. దేశ‌ ఆర్థిక వ్యవస్థ దృఢంగా పురోగమిస్తోందనే ప్రచారాన్ని నమ్మ వ‌ద్ద‌న్నారు. అంతేకాదు.. ఈ ప్ర‌చారం ద్వారా మోడీ ప్ర‌భుత్వం అతి పెద్ద తప్పు చేస్తోందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ 5వ స్థానంలో ఉంద‌నేది స‌రికాద‌ని.. ఉన్నా కూడా.. ఇప్ప‌టికిప్పుడు పుంజుకుంద‌నేది శుద్ద అబ‌ద్ధంగా పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ వృద్ధిని సాధించాలంటే ముఖ్యమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాజ‌న్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వానికి శ్రామికశక్తి విద్య, నైపుణ్యాల మెరుగుదల అంశం ప్రధాన సమస్యగా మారుతుందని అన్నారు.

ఈ సవాలును పరిష్కరించకపోతే దేశ యువత ప్రయోజనాలను పొందలేదని, నిరుద్యోగ స‌మ‌స్య ఎక్క‌డిద‌క్క‌డే ఉంటుంద‌న్నారు. మోడీ చేస్తున్న ఆర్థిక వృద్ధి ప్రచారం నిజమవడానికి ఇంకా చాలా సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. ఈ ప్రచారాన్ని జనాలు నమ్మాలని రాజకీయ నాయకులు భావిస్తుంటారని, తాము సాధించామని చెప్పుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తుంటారని విమ‌ర్శ‌లు గుప్పించారు.

భారత్ ఈ ప్రచారాన్ని నమ్మడం తప్పు అవుతుందని అన్నారు. మరోవైపు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యాన్ని కూడా రఘురామ్ రాజన్ కొట్టిపారేశారు. దేశంలోని చాలా మంది పిల్లలకు హైస్కూల్ స్థాయి చదువులేనప్పుడు, మధ్యలోనే చదువు మానేస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధి లక్ష్యం గురించి మాట్లాడడంలో అర్ధం లేదని వ్యాఖ్యానించారు.

దేశంలో శ్రామిక శక్తి ఉందని, యువత మంచి ఉద్యోగాలలో ఉపాధి పొందితేనే దేశానికి ప్రయోజనమని అన్నారు. కానీ, ఆదిశ‌గా మోడీ ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేద‌న్నారు. శ్రామికశక్తికి ఉద్యోగాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని, ఎక్కడా ఆదిశ‌గా చ‌ర్య‌లు లేన‌ప్పుడు ప్ర‌యోజ‌నం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాగా.. గ‌తంలోనూ ర‌ఘురామ రాజ‌న్‌.. మోడీ స‌ర్కారు విధానాలను ఎండ‌గ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.