గంటా, విష్ణు గొడవ.. రఘురామ ఎంట్రీతో మరో మలుపు!
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మధ్య రేగిన వివాదాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మలుపు తిప్పారు.
By: Tupaki Desk | 30 April 2025 4:16 AMమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మధ్య రేగిన వివాదాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మలుపు తిప్పారు. ప్రజా ఫిర్యాదులపై ఏర్పడిన శాసనసభ కమిటీ సమావేశాన్ని విశాఖలో ఏర్పాటు చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కూటమి పార్టీలోని ఇద్దరు నేతలతో సమావేశమయ్యారు. ఏం మాట్లాడారో..? ఎలా సర్ది చెప్పారో కానీ, రెండు రోజుల క్రితం చిర్రుబుర్రులాడిన గంటా.. ఎమ్మెల్యే విష్ణుతో చేతులు కలిపారు. దీంతో ఆ ఇద్దరి మధ్య చెలరేగిన వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని చర్చ జరుగుతోంది.
ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు క్రియాలశీలమవుతోంది. ప్రజా ఫిర్యాదులపై ఏర్పడిన శాసనసభ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న రఘురామ తొలి సమావేశాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రఘురామతోపాటు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు, జగన్మోహన్, కొణతాల రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం విశాఖ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు గంటా, విష్ణుకుమార్ రాజు మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విశాఖలో ఫిల్మ్ నగర్ భూముల లీజు విషయంలో స్థానిక ఎమ్మెల్యే గంటాకు తెలియకుండా బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి వినతి పత్రం పంపడం వివాదానికి దారితీసింది. విశాఖ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా కలుసుకున్న విష్ణు, గంటా.. ఫిల్మ్ నగర్ లీజుల విషయంపై బహిరంగంగా వాదులాడుకున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు క్షమాపణ చెప్పినా, గంటా తీవ్ర మనస్థాపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇది జరిగిన రెండు రోజులుకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఎంట్రీతో ఆ ఇద్దరి మధ్య గొడవకు శుభం కార్డు పడిందని చెబుతున్నారు. కూటమిలో అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ పెద్దన్న పాత్ర తీసుకుని ఫిల్మ్ నగర్ భూముల విషయంలో వాదులాడుకున్న ఇద్దరి ఎమ్మెల్యేలతో మాట్లాడి సర్దిచెప్పినట్లు చెబుతున్నారు. దీంతో శాసనసభ కమిటీ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేలు గంటా, విష్ణుకుమార్ రాజు ఎప్పటిలానే హ్యాపీగా మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. రఘురామ మధ్యవర్తిత్వంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చెలరేగిన వివాదం టీ కప్పులో తుఫాన్ లా చప్పున చల్లారిపోయిందని అంటున్నారు. ఈ పరిణామంతో రెండు పార్టీల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉండి నుంచి టీడీపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచిన డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి తాజా ఉదంతం ఉదాహకరణగా చెబుతున్నారు. ఆయన టీడీపీ నేతగా ఉన్నప్పటికీ బీజేపీ, జనసేన నేతలతోనూ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. డిప్యూటీ స్పీకరుగా సభను సమర్థంగా నడిపిస్తున్న రఘురామ.. ఎమ్మెల్యేల మధ్య వివాదాల పరిష్కారంలోనూ తన పాత్ర పోషిస్తుండటం విశేషంగా చెబుతున్నారు. కాగా, ఎమ్మెల్యే విష్ణు, డిప్యూటీ స్పీకర్ రఘురామ ఒకే సామాజికవర్గం నేతలు కావడంతోపాటు వారిద్దరు ఆంధ్రా వర్సిటీలో కలిసి చదువుకోవడం కూడా గంటాతో గ్యాప్ ను సరిచేసేందుకు చొరవ తీసుకునేలా చేసిందని అంటున్నారు. మొత్తానికి ఇరుపార్టీల పెద్దలకు తలనొప్పులు తేకుండా రఘురామ చొరవతో గొడవ సర్దుమణగడం విశేషంగా చెబుతున్నారు.