Begin typing your search above and press return to search.

పుంగ‌నూరు టీడీపీ వీక‌వుతోందా.. ?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరు. వైసీపీ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఇలాకాగా పేరొందిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌న్న‌ది టీడీపీ పెట్టుకున్న భారీ ల‌క్ష్యం.

By:  Garuda Media   |   17 July 2026 11:00 PM IST
పుంగ‌నూరు టీడీపీ వీక‌వుతోందా.. ?
X

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరు. వైసీపీ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఇలాకాగా పేరొందిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌న్న‌ది టీడీపీ పెట్టుకున్న భారీ ల‌క్ష్యం. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ పాగా వేయాల‌ని అనుకున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా స్ప‌ష్ట‌మైన మెజారిటీ ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మార్పులు చేర్పులు కూడా చేశారు. కానీ, అనుకున్న విధంగా త‌మ్ముళ్లు ఇక్క‌డ ప‌నిచేయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

దీనికి తోడు ఇంచార్జ్‌పై పెత్త‌నం పెరిగింద‌న్న‌వాద‌నా వినిపిస్తోంది. ఇటీవ‌ల పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలను స‌రిచేసేందుకు, నాయ‌కుల‌ను గాడిలో పెట్టేందుకు పెద్ద ప్ర‌య‌త్న‌మే చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో అయితే.. ర‌గ‌డ జ‌రుగుతుంద‌ని భావించిన అధిష్టానం..తిరుప‌తి వేదిక‌గా పుంగ‌నూరు రాజ‌కీయాల‌ను స‌రిచేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. అయితే.. ఇక్క‌డ కూడా త‌మ్ముళ్లు త‌న్నుకున్న ప‌రిస్తితి క‌నిపించింది. దీనికి కార‌ణం.. ఎప్ప‌టి నుంచో ఉన్న త‌మ‌కు గుర్తింపు లేకుండా పోయింద‌న్న వాద‌న‌.

అయితే, పార్టీలో ఎప్ప‌టి నుంచి ఉన్నార‌న్న‌దికాదు.. ఏం చేస్తున్నారు ? అన్న‌దే చూస్తామ‌ని పార్టీ అధిష్టానం చెబు తోంది. దీంతో సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి.. కొంత‌మంది జూనియ‌ర్ల‌కు పార్టీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఇది ఏ ఒక్క‌రికీ మింగుడు ప‌డ‌డం లేదు. దీంతో నియోజ‌క‌వర్గంలో టీడీపీ కార్య‌క్ర‌మాలు నామ‌మాత్రంగానే జ‌రుగుతున్నాయి. పైగా.. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇవ‌న్నీ.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీవీక్ చేస్తున్నాయ‌న్న‌ది నిర్వివాదాంశం.

వాస్త‌వానికి నియోజ‌క‌వ‌ర్గంలో పుంజుకునేందుకు ఇదే త‌గిన స‌మ‌యం అని పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చెబు తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు మాత్రం.. దీనిని ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రోవైపు.. అంత‌ర్గ‌త కుమ్ములా ట‌లు పెర‌గ‌డంతో దాడుల వ‌ర‌కు విష‌యం వెళ్లింది. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న పార్టీ..ప‌లువురు సొంత నాయ‌కుల‌పైనే కేసులు పెట్టించింది. ఇది మ‌రింత వేడెక్కించింది. ఫ‌లితంగా ఇప్పుడు పుంగ‌నూరులో టీడీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇదే కొన‌సాగితే.. పార్టీ ల‌క్ష్యం నెర‌వేరుతుందా? అనేది చూడాలి.