ఐపీఎస్ ఆంజనేయులుకు బెయిలు.. రీజనేంటంటే!
కానీ... తాజాగా విజయవాడ కోర్టు పీఎస్ ఆర్కు 14 రోజుల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది.
By: Tupaki Desk | 11 Jun 2025 7:28 PMజగన్ జమానాలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ ఆర్ ఆంజనేయులుకు తాజాగా బెయి ల్ లభించింది. జగన్ హయాంలో ఏకకాలంలో రెండు కీలక పదవులు నిర్వహించిన ఏకైక అధికారి కూడా ఈయనే కావడం గమనార్హం. ఒకవైపు ఇంటెలిజెన్స్ చీఫ్గానే కాకుండా.. మరోవైపు ఏపీపీఎస్సీ సెక్రటరీగా కూడా పీఎస్ ఆర్ ఆంజనేయులు పనిచేశారు. అయితే.. ఈ రెండు వ్యవహారాల్లోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండు కీలక కేసులు నమోదై.. జైలు కు వెళ్లారు. ఇప్పటికి పలుమార్లు ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాకోర్టులు కొట్టేశాయి.
కానీ... తాజాగా విజయవాడ కోర్టు పీఎస్ ఆర్కు 14 రోజుల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ప్రస్తుతం పీఎస్ ఆర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బీపీలో హెచ్చుతగ్గులు, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యం లోనే తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. కానీ, విచారణాధికారులు మాత్రం ఆయనకు బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో అనారోగ్య సమస్యల కారణంగా 14 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు కోర్టు పేర్కొంది అయితే.. కొన్ని షరతులు కూడా విధించింది. సాక్షులను ప్రభావితం చేయరాదని పేర్కొంది. అదేవిధంగా విదేశాలకు వెళ్లరాదని ఆదేశించింది.
ఏంటా కేసులు..?
జగన్ హయాంలో ముంబై నటి జెత్వానీని అక్రమంగా అరెస్టు చేయడంతోపాటు.. ఆమె కుటుంబ సభ్యులను కూడా వేధించారన్న కేసు నమోదైంది. దీనిని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పీఎస్ ఆర్ ఆంజనేయులపై ఈ కేసు పెట్టారు. ఇతర అధికారులపై పెట్టినా..వారిని అరెస్టు చేయలేదు. ఇక, ఈ కేసులో బెయిల్ వచ్చిం ది. కానీ.. ఇంతలోనే ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు విద్యార్థులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా మరో కేసు నమోదైంది.
ఏపీపీఎస్సీలో జరగాల్సిన మూల్యాంకనం.. గుంటూరులోని హాయ్ ల్యాండ్లో నిర్వహించా రని.. ప్రైవేటు సంస్థ క్యామ్సన్కు ఈ బాధ్యతలు అప్పగించారని ఫిర్యాదు వచ్చింది. దీనిలోనే అవకతవకలు జరిగాయన్న విద్యార్థుల ఆందోళన. ఈ కేసులోనూ.. పీఎస్ ఆర్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన జైల్లో ఏర్పారు. దీనిలోనే బెయిల్ కూడా లభించడం లేదు. గత వారం రోజుల నుంచి ఆయన తన ఆరోగ్యం బాగుండడం లేదని చెబుతున్నారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందించారు. కానీ, ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తాజాగా బెయిల్ ఇచ్చింది. ఆయనను హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నైలలో ఎక్కడికి తరలించినా వైద్యం కోసమే తీసుకువెళ్లాలని ఆదేశించింది.