Begin typing your search above and press return to search.

ప్రచార వేళ.. మల్లారెడ్డి కోడలి గదిలోకి వెళ్లి అలా చేశారట!

తాజాగా ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆమె తన రాజకీయ ప్రత్యర్థుల మీద తీవ్రమైన ఆరోపనలు చేశారు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 5:08 AM GMT
ప్రచార వేళ.. మల్లారెడ్డి కోడలి గదిలోకి వెళ్లి అలా చేశారట!
X

ఎన్నికల వేడి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. కీలకమైన పోలింగ్ ఘట్టం రెండో రోజులకు చేరుకున్న వేళ.. ప్రతి నిమిషం అత్యంత విలువైనదే. ఈ క్రమంలో చోటు చేసుకునే చిన్న పరిణామం సైతం ఫలితాలు మారేలా ప్రభావాన్ని చూపుతుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి మేడ్చల్ అసెంబ్లీ బరిలోనిలిచిన మంత్రి మల్లారెడ్డి విషయంలో చోటు చేసుకుంది. మల్లారెడ్డి బలం.. బలగం ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి మల్లారెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న ఆయన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి (కొడుకు భద్రారెడ్డి సతీమణి) తన మాటలతో ఇప్పటికే ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి చెందిన ఆసుపత్రుల్లో ఆమె ఎలా వ్యవహరిస్తారో అక్కడి వారిని అడిగితేనే అర్థమవుతుంది. అలాంటి ఆమె.. రాజకీయాల్లో ఎలా వ్యవహరిస్తారన్న సందేహం ఉండేది. అలాంటి డౌట్లను కొట్టిపారేసేలా చేశారు డాక్టర్ ప్రీతి.

తాజాగా ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆమె తన రాజకీయ ప్రత్యర్థుల మీద తీవ్రమైన ఆరోపనలు చేశారు. తనను గలీజ్ మాటలతో తిట్టారని.. తనను భయపెట్టారన్న ఆమె.. ఇలాంటి వారికి ఓట్లు వేస్తారా? అంటూ కాంగ్రెస్ నేతల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన మామ మల్లారెడ్డి మేడ్చల్ బరిలో ఉండటం.. అక్కడ తమకు నివాసం లేకపోవటంతో.. హోటల్ లోనే ఉంటూ ప్రచారం చేస్తున్నట్లుగాచెప్పిన ఆమె.. అలాంటిది హోటల్ రూంకు వచ్చి తనపై బెదిరింపులకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు.

డాక్టర్ ప్రీతిరెడ్డి మాటల్ని చూస్తే.. "ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నెల రోజులుగా మేడిపల్లిలోనిఎస్వీఎం గ్రాండ్ హోటల్లో ఉంటున్నా. ఈ రోజు మధ్యాహ్నం12 నుంచి పన్నెండున్నర గంటల మధ్యలో తాను ఉంటున్న హోటల్ కు పాతిక మంది కాంగ్రెస్ నేతలు వచ్చి బెదిరింపులకు దిగారు" అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైరల్ వీడియోలో.. "ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి తాను ఉంటున్న గదికి వచ్చి.. బెదిరించారు. గలీజ్ మాటలు తిడుతూ భయపెట్టారు. వాళ్లు అలా ఎందుకు తిడుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు. వాళ్లు ఓడిపోతున్నట్లు కాంగ్రెస్ నేతలకు అర్థమైంది. అందుకే ఏం చేయలేక ఇలాబెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి బెదిరింపులు.. భయపెట్టే చర్యలు సరికాదు. అధికారంలోకి రాక ముందే ఇలా చేస్తున్నారు. ఇలాంటి రౌడీయిజం.. గుండాయిజం చేసే పార్టీకి ఓట్లు వేయొద్దు" అంటూ పేర్కొన్నారు. హోటల్ రూంకు వచ్చిన అంతలా తిట్టి.. బెదిరింపులకు పాల్పడిన వారికి సంబంధించిన హోటల్ సీసీ ఫుటేజ్ ను తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారా? లేదా? అన్నది తెలియరాలేదు.