Begin typing your search above and press return to search.

బాబుకు సూచనలు - బ్రాహ్మణికి ప్రశ్నలు... పోసాని ఫైర్!

ఈ సమయంలో ఆయనను ములాకత్ లో కలిసిన నేతలు, కుటుంబ సభ్యులు జైలు గదిలో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారంటూ చేస్తున్న కామెంట్లపై పోసాని తనదైన శైలిలో స్పందించారు.

By:  Tupaki Desk   |   19 Sep 2023 3:39 PM GMT
బాబుకు సూచనలు - బ్రాహ్మణికి ప్రశ్నలు... పోసాని ఫైర్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. లోపల ఇబ్బందులు పడుతున్నారంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయనను ములాకత్ లో కలిసిన నేతలు, కుటుంబ సభ్యులు జైలు గదిలో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారంటూ చేస్తున్న కామెంట్లపై పోసాని తనదైన శైలిలో స్పందించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని దోమలు కుడుతున్నాయని, ఆయన చన్నీళ్ల స్నానం చేస్తున్నారని, ఏసీ లేకుండా ఎలా ఉంటారంటూ ఆయనను ములాఖత్ లో కలసి వచ్చిన నాయకులు, కుటుంబ సభ్యులు బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన జైలు గదిలో బొద్దింకలు, బల్లులు ఉన్నాయని.. దీంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

దీంతో ఈ కామెంట్లపై వైసీపీ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. కోర్టు అనుమతుల పరిధి మేరకు బాబుకు అన్ని వసతులూ కల్పించామని చెబుతున్నారు. జైలులో ఉంటే ఖైదీలా ఉండాలి కానీ, రాచమర్యాదలు ఎలా జరుగుతాయని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి స్పందించారు.

ఇందులో భాగంగా చంద్రబాబుకు అవసరమైన దోమల మందు, దోమతెరలు తానే పంపిస్తానని అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కోసం తానే ఒక ఏసీ కొంటానని, ఎవరైనా జైలులోకి వెళ్లి ఆయనకు ఇచ్చిరావాలని స్పందించారు. అనంతరం బాబు అరెస్ట్ పై బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలపైనా పోసాని స్పందించారు. ఈ సందర్భంగా ఆమెకు నాలుగు ప్రశ్నలు సంధించారు.

అవును... బ్రాహ్మణి ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మొదలుపెట్టిన పోసాని... "మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు? మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు? చంపిందెవరు? వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారు?" ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబితే నీ కాళ్లకు దండం పెడతా అంటూ పోసాని బ్రాహ్మణికి సవాల్ విసిరారు!

ఇక చంద్రబాబు చేసిందంతా ప్రజల కోసమే చేశారని చెబుతున్నారంటూ భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపైనా స్పందించిన పోసాని... ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజల కోసమే అంటే ఎలా అంటూ ఫైరయ్యారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొన్నది కూడా ప్రజల కోసమేనా అని ప్రశ్నించారు.

దేశంలో చంద్రబాబుకు ఉన్నన్ని స్టేలు ఎవరికి లేవని చెప్పిన పోసాని... ఇప్పటి వరకు 17 స్టేలు తెచ్చుకుని రికార్డు సృష్టించారని తెలిపారు. అనంతరం.. అవినీతి పనులు చేస్తే ఎవరినైనా జైలులో పెడతారని.. జైల్లో ఉన్నప్పుడు ఒక ఏడాదో, ఏడాదిన్నరో ప్రశాంతంగా ఉండొచ్చు కదా.. జైల్లో ఉండి కూడా ధర్నాలు, ఆందోళనలు దేనికి చంద్రబాబు? అంటూ పోసాని కృష్ణమురళి సూచనలతో కూడిన ప్రశ్నలు వేశారు.