Begin typing your search above and press return to search.

షాకింగ్ ఇష్యూ... ఢిల్లీలో ఉంటే ఆయష్షు ఎంత తగ్గిపోద్దో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన కాలుష్య స్థాయిలకంటే దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం చాలా ఎక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   29 Aug 2023 2:05 PM GMT
షాకింగ్ ఇష్యూ... ఢిల్లీలో ఉంటే ఆయష్షు ఎంత తగ్గిపోద్దో తెలుసా?
X

సాధారణంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో ఉంటే లైఫ్ బాగుంటుందని.. పైగా మెట్రోపాలిటన్ సిటీలో ఉంటే కంఫర్ట్ జోన్ ఎక్కువగా ఉంటుందని.. రాజధానుల్లో ఉంటే ఆ సదుపాయాలు, ఆ అవకాశాల లెక్కే వేరని చెబుతుంటారు. అయితే ఇవన్నీ మేడిపండు రకం సుఖాలే, సంతృప్తులే అని అంటుంది తాజా అధ్యయనం.

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ కాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ పెరిగిపోతున్న పారిశ్రామికారణతోపాటు వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువుల వల్ల కాలుష్యం పెరిగిపోతుందని అంటున్నారు. ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ కొనసాగుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది.

అవును... యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన "ది ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌" వెల్లడించిన వివరాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఇందులో భాగంగా... ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన కాలుష్య స్థాయిలకంటే దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం చాలా ఎక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.

ఫలితంగా... ప్రస్తుత కాలుష్య స్థాయి ఇదే రీతిలో కొనసాగితే ఇక్కడి ప్రజలు 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తాజా నివేదిక తెలిపింది. ఇదే క్రమంలో దేశంలో 67.4 శాతం మంది కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... అత్యంత తక్కువ కాలుష్యమున్న పంజాబ్‌ లోని పఠాన్‌ కోట్‌ జిల్లాలోనూ ప్రమాదకర కాలుష్య స్థాయిలు (పీఎం2.5) ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే ఏడురెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడి ప్రజల ఆయుస్సు కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని అంచనా వేసింది.

ఇదే సమయంలో... ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేర్కొన్న ఢిల్లీలో డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడున్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కాలుష్యం కారణంగానే కోల్పోనున్నారని తెలిపింది.

అందుకు గల కారణాలను కూడా ఈ తాజా నివేధిక అంచనా వేసింది. ఇందులో భాగంగా... దేశంలో మిగతా ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడి జనాభా సాంద్రత మూడురెట్లు ఎక్కువగా ఉండటం.. తద్వారా వాహనాలు, నివాస ప్రాంతాలు, వ్యవసాయ సంబంధిత పనులతో కాలుష్యం మరింతగా పెరిగిపోతోతుండటం వల్ల.. ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.