ప్రధాని వస్తున్నారు.. చిన్నమ్మ ఏమయ్యారు..!
అంతా బాగానే ఉంది. అంతా ప్రభుత్వమే చేస్తోంది. కానీ.. అసలు బీజేపీ ఏమైందన్న ప్రశ్న వస్తోంది.
By: Tupaki Desk | 2 May 2025 7:30 AMఏపీ రాజధాని అమరావతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో 24 గంటల్లో రానున్నారు. దీనికి సంబంధించి.. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అదిరిపోయేలా సభను కూడా నిర్వహిస్తోంది. భారీ ఎత్తున 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో(కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి) 5 లక్షల మంది ప్రజలను ఈ సభకు తీసుకువస్తున్నారు. అంతా బాగానే ఉంది. అంతా ప్రభుత్వమే చేస్తోంది. కానీ.. అసలు బీజేపీ ఏమైందన్న ప్రశ్న వస్తోంది.
సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రంలో పర్యటించినా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నుంచి కూడా.. ప్రయత్నాలు సాగుతాయి. సభా వేదికను బీజేపీ రాష్ట్ర స్థాయి అగ్రనేతలు పరిశీలిస్తారు. పనులను పర్యవేక్షి స్తారు. ఏమైనా సూచనలు, సలహాలు కూడా చెబుతారు. కానీ, ఏపీ విషయానికి వస్తే.. రాష్ట్ర పార్టీ చీఫ్గా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. పైగా.. ఎవరికి వారు అన్నట్టుగా ఉన్నారు.
మొత్తంగా ప్రభుత్వం, టీడీపీ నాయకులు మాత్రమే.. సభా ఏర్పాట్లు, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు.. ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరి పురందేశ్వరి ఏం చేస్తున్నట్టు? అనేది ప్రశ్న. అయితే.. దీనికి ఆమె మాటను ఎవరూ వినిపించుకోవడం లేదని.. అందుకే ఆమె కీలక కార్యక్రమం ద్వారా తన నిరసన వ్యక్తం చేస్తున్నారన్న చర్చ అయితే జరుగుతోంది. అందుకే.. ప్రధాని వస్తున్నా.. ఇక్కడ సభ పెడుతున్నా.. పురందేశ్వరి కనీసం పరిశీలించలేదని తెలుస్తోంది.
వాస్తవానికి..చంద్రబాబు ఒక్కరే ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. జనసేన కూడా జోక్యం చేసుకోవడం లేదు. అలాగని మొత్తం క్రెడిట్ను చంద్రబాబు కూడా కోరుకోవడం లేదు. కలిసి వచ్చేవారి కోసం ఆయన నిన్న మొన్నటి వరకు కూడా ఎదురు చూశారు. అయినప్పటికీ.. బీజేపీ నాయకులు ఎవరూ జోక్యం చేసుకోలేదు. పైగా.. ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. ఇక, సభా వేదికపై ఎవరికి అవకాశం చిక్కుతుందన్నది దీనిని బట్టి తెలుస్తోంది. గతంలో ప్రధాని వచ్చినప్పుడు ఈ విషయం వివాదంగా మారింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.