స్పృహ తప్పిన ఫైలెట్.. గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం.. భయానక పరిస్థితి!
గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా పైలట్ స్పృహ తప్పిపోతే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే భయానకంగా ఉంది కదూ.
By: Tupaki Desk | 18 May 2025 5:26 AMగాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా పైలట్ స్పృహ తప్పిపోతే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే భయానకంగా ఉంది కదూ. సరిగ్గా అలాంటి ఘటనే గతేడాది లుఫ్తాన్సా విమానంలో జరిగింది. స్పెయిన్కు వెళ్తున్న ఈ విమానంలో కో-పైలట్ హఠాత్తుగా స్పృహ కోల్పోవడంతో ఏకంగా 10 నిమిషాల పాటు విమానం పైలట్ లేకుండానే గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటే షాక్ అవుతారు.
గతేడాది ఫిబ్రవరి 17న ఫ్రాంక్ఫర్ట్ నుంచి స్పెయిన్లోని సెవిల్లేకు లుఫ్తాన్సా ఎయిర్బస్ A321 విమానం బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కెప్టెన్ బాత్రూమ్కు వెళ్లారు. కాక్పిట్లో ఒంటరిగా ఉన్న కో-పైలట్ హఠాత్తుగా స్పృహ కోల్పోయాడు. ఈ విషయాన్ని స్పానిష్ ప్రమాద పరిశోధన సంస్థ CIAIAC నివేదిక ద్వారా వెల్లడించింది.
199 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఉన్న ఆ విమానం ఏకంగా 10 నిమిషాల పాటు పైలట్ లేకుండానే విమానం గాల్లో ప్రయాణించింది. ఈ విషయాన్ని లుఫ్తాన్సా సంస్థ కూడా ధృవీకరించింది. తమ విమాన భద్రతా విభాగం కూడా దీనిపై దర్యాప్తు చేసిందని తెలిపింది. అయితే దర్యాప్తు ఫలితాలను మాత్రం వెల్లడించలేదు.
స్పృహ కోల్పోయిన కో-పైలట్ అనుకోకుండా ఫ్లైట్ కంట్రోల్స్ ఆపరేట్ చేసినప్పటికీ అదృష్టవశాత్తూ ఆటోపైలట్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతో విమానం స్థిరంగా ప్రయాణించగలిగింది. ఈ సమయంలో కాక్పిట్లోని వాయిస్ రికార్డర్లో తీవ్రమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితికి సంబంధించిన వింత శబ్దాలు రికార్డయ్యాయి.
కెప్టెన్ కాక్పిట్లోకి వెళ్లడానికి సాధారణ డోర్ ఓపెనింగ్ కోడ్ను ఐదుసార్లు ప్రయత్నించాడు. కానీ తలుపు తెరుచుకోలేదు. ఒక ఎయిర్ హోస్టెస్ కూడా లోపలున్న కో-పైలట్ను ఆన్బోర్డ్ టెలిఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించింది. చివరికి, కెప్టెన్ ఎమర్జెన్సీ కోడ్ను ఉపయోగించి తలుపును తెరవడానికి ప్రయత్నించాడు. అయితే, తలుపు ఆటోమేటిక్గా తెరుచుకునే కొద్ది క్షణాల ముందు, అనారోగ్యంతో ఉన్నప్పటికీ కో-పైలట్ లోపలి నుంచి తలుపు తెరిచాడు.
ఆ తర్వాత పైలట్ వెంటనే అప్రమత్తమై మాడ్రిడ్లో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. స్పృహ కోల్పోయిన కో-పైలట్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆటోపైలట్ వ్యవస్థ సకాలంలో స్పందించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.