Begin typing your search above and press return to search.

ఉగ్రదాడికి సూత్రధారి ఖలీద్... అతనిపై పాక్ సైన్యం పూల వర్షం!

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 April 2025 10:25 AM
ఉగ్రదాడికి సూత్రధారి  ఖలీద్... అతనిపై పాక్  సైన్యం పూల వర్షం!
X

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి బాధ్యత పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయినాకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీ.ఆర్.ఎఫ్.) తీసుకుంది. ఈ సమయంలో ఈ దాడులకు సంబంధించిన ప్రధాన సూత్రధారి వ్యవహారం, అతడికి పాక్ సైన్యం మద్దతు పలు విషయాలు తెరపైకి వచ్చాయి!

అవును... పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇప్పటి వరకూ 26 మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడి చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో టీ.ఆర్.ఎఫ్. ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ ప్రధాన సూత్రధారి అని చెబుతుండగా.. పలు విషయాలు తెరపైకి వచ్చాయి.

లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఖలీద్ ను సైఫుల్ల్లా కసూరి అని కూడా పిలుస్తారు. అతడు భారత్ అతిపెద్ద శత్రువు హఫీజ్ సయీద్ కు సమీప వ్యక్తి అని చెబుతున్నారు. దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఇతడి పేరు చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఖలీద్ నిత్యం లగ్జరీ కార్లలో ప్రయాణిస్తాడని అంటున్నారు.

తాజా దాడికి రెండు నెలల క్రితం సైఫుల్లా ఖలీద్ పాకిస్థాన్ లోని పంజాబ్ లో గల కంగన్ పూర్ కు చేరుకున్నట్లు చెబుతున్నారు. అక్కడ పాక్ సైన్యానికి సంబంధించి పెద్ద బెటాలియన్ ఉంది. ఈ సమయంలో.. పాకిస్థాన్ ఆర్మీ కల్నల్ జాహిద్ జరీన్ ఖట్టక్... జీహాదీ ప్రసంగం చేయడానికి ఖలీద్ ను ఆహ్వానించాడని అంటున్నారు.

ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఖలీద్ పై పాక్ కల్నల్ స్వయంగా పూలవర్షం కురిపించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో.. అతడి ప్రసంగం పాక్ సైన్యాన్ని, ఉగ్రవాదులను ఉసిగొల్పేలా.. భారత సైన్యాన్ని రెచ్చగొట్టేలా సాగిందని చెబుతున్నారు.

అదేవిధంగా... పాకిస్థాన్ లోని ఖైబర్ పంఖ్తుఖ్వా లో జరిగిన సమావేశంలో నూ ప్రసంగించిన ఖలీద్... "ఈ రోజు ఫిబ్రవరి 2 - 2025న నేను వాగ్దానం చేస్తున్నాను.. 2026 ఫిబ్రవరి 2 నాటికి కశ్మీర్ విముక్తి పొందుతుంది" అని చెప్పినట్లు కథనాలొస్తున్నాయి. ఈ సమావేశాన్ని పాక్ సైన్యం, ఐ.ఎస్.ఐ. సంయుక్తంగా నిర్వహించాయని సమాచారం!

ఈ నేపథ్యంలోనే తాజా దాడికి పక్కాగా ప్లాన్ చేశారని.. ఈ ఉగ్రదాడిలో 5 - 6 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల వెనుక మాస్టర్ మైండ్ ఖలీద్ కాగా... దాడి సమయంలో టీమ్ కు అసిఫ్ ఫౌజీ నాయకత్వం వహించాడని అంటున్నారు. ఇతడు గతంలో పాక్ ఆర్మీలో పనిచేశాడని.. అందుకే పేరు చివర ‘ఫౌజీ’ ఉందని కూడా చర్చ జరుగుతోంది.