Begin typing your search above and press return to search.

మొద‌టి ముద్దాయి చంద్ర‌బాబే: పుంగ‌నూరు ఘ‌ట‌న‌పై పెద్దిరెడ్డి కామెంట్లు

By:  Tupaki Desk   |   4 Aug 2023 3:45 PM GMT
మొద‌టి ముద్దాయి చంద్ర‌బాబే:  పుంగ‌నూరు ఘ‌ట‌న‌పై పెద్దిరెడ్డి కామెంట్లు
X

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరులో చోటు చేసుకున్న తీవ్ర ఉద్రిక్త‌త‌, పోలీసుల‌పై జ‌రిగిన దాడి.. ఎదురు జ‌రిగిన లాఠీ చార్జి ఘ‌ట‌న‌ల్లో చాలా మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల నం సృష్టించింది. పుంగనూరు ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మొద‌టి ముద్దాయి చంద్ర‌బాబే అని అన్నారు.

తాజాగా ఆయ‌న సెల్ఫీ వీడియోను విడుద‌ల చేశారు. ``చంద్రబాబు నాయుడు రౌడీ మూకలను రెచ్చగొట్టా రు. డబుల్ బ్యారెల్ గన్స్ కూడా పెట్టుకుని టీడీపీ వారు వచ్చారు. చంద్రబాబు మాటలకు రెచ్చిపోయి పోలీసు వాహనాలపై వారు దాడి చేశారు. ఒక పద్దతి ప్రకారం మొత్తం చేశారు. చంద్రబాబు దిగజారుడు తనం, నిరాశా నిస్పృహతో ఇలాంటి చర్యలకు ఒడికట్టారు. చంద్రబాబు నాయుడు ను మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేయాలి`` అని వ్యాఖ్యానించారు.

పుంగ‌నూరు దాడుల‌కు సంబంధించి.. దౌర్జన్యానికి పాల్పడిన వారి వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయ‌ని మంత్రి చెప్పారు. కావాలనే చంద్రబాబు రెచ్చ గొట్టారన్న ఆయ‌న చంద్రబాబు షెడ్యూల్‌లో పుంగనూరు సిటీలో రోడ్ షో విష‌యం లేద‌ని, ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కులు కూడా చెప్పార‌ని తెలిపారు. బైపాస్ లో వెళతారు అని ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారని అన్నారు.

ఆ తర్వత కావాలనే పుంగనూరు లోపలి వెళ్లి రచ్చ చేయాలని చూసారని మంత్రి పెద్ది రెడ్డి విమ‌ర్శించారు. చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేకపోయి ఉండాలని ఎద్దేవా చేశారు. లేదా నిరాశ నిస్పృహతో ఇలా వ్యవహరించి ఉంటార‌ని చెప్పారు. సిఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలతో ఇక గెలవలేను అని చంద్రబాబు డిసైడ్ అయ్యారని అన్నారు. చంద్ర‌బాబు మంచి డాక్టర్ కు చూపించుకుని, ప్రజాస్వామ్యం పద్దతిలో ఎన్నికల్లో పోటీ పడాలని సూచించారు.