మీరు చెప్పిన రోజున విచారణకు రాలేను.. పెద్దిరెడ్డి అంటే ఆ మాత్రం ఉండదా?
చేతిలో అధికారం ఉన్నా లేకున్నా.. కొందరు నిత్యం వార్తల్లో ఉంటారు. మరికొందరు అందుకు భిన్నం.
By: Tupaki Desk | 17 April 2025 5:57 AMచేతిలో అధికారం ఉన్నా లేకున్నా.. కొందరు నిత్యం వార్తల్లో ఉంటారు. మరికొందరు అందుకు భిన్నం. అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగే వారు.. అధికారం చేజారిన తర్వాత అడ్రస్ ఉండరు. ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లెక్కే వేరు. ఆయన మొదటి కోవకు చెందిన వారు. అధికారం ఉన్నా.. లేకున్నా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయనకు ఎదురే లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఎన్ని వివాదాలు ఎదురైన తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసే సత్తా.. సామర్థ్యం ఆయన సొంతంగా చెబుతారు.
విపక్షంలో ఉన్న వేళ.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో భూముల అంశానికి సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ అధికారులు కోరిన వేళ.. పెద్ది రెడ్డి ఇచ్చిన ఆన్సర్ ఏమిటో తెలుసా? నేను ప్రజాప్రతినిధిని. ముందుగా నిర్ణయించుకున్న ప్రోగ్రాంల కారణంగా మీరు చెప్పిన రోజు విచారణకు హాజరుకాలేనంటూ తేల్చేవారు. తిరుపతి నగరంలోని తమ భూముల ఆక్రమణలపై హైకోర్టు ఆదేశాల మేరకు వివరణ ఇవ్వాలంటూ పెద్దిరెడ్డికి బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు నోటీసులు జారీ చేశారు.
ఏప్రిల్ 17న మఠం కార్యాలయానికి వ్యక్తిగతంగా కానీ ఆయన తరఫు ఎవరినైనా కానీ పంపి రికార్డులు ఉంటే తమకు అప్పగించాలని కోరారు. నోటీసు ఇచ్చిన సందర్భంలో అధికారులను ఉద్దేశించి పెద్దిరెడ్డి స్పందిస్తూ.. తన తమ్ముడు.. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి సదరు భూముల్ని కొన్నారని.. రికార్డుల్ని మాత్రం అందిస్తారని చెప్పటం గమనార్హం.
ఎమ్మార్ పల్లి పరిధిలో 3.88 ఎకరాల భూమి పెద్దిరెడ్డి కుటుంబీకుల ఆక్రమణలో ఉంది. బుగ్గమఠం భూముల అన్యాక్రాంతం వ్యవహారంలోనే డేగల మునస్వామి.. పట్టెం వెంకటరాయులు.. యశోదమ్మ.. పురంధర్ అనే వ్యక్తులకు కూడా అధికారులు నోటీసులు ఇవ్వగా.. వారు సైతం వేర్వేరు కారణాలతో విచారణకు హాజరుకాలేమని పేర్కొనటం విశేషం. అక్రమణలపై సర్వే కోసం మఠం ఈవోతో పాటు.. తిరుపతి అర్బన్ సర్వే సిబ్బంది పోలీసులు వెళ్లగా.. కొంతసేపటికే సర్వే వాయిదా వేసినట్లు ప్రకటించటం ఆసక్తికరంగామారింది. ఏమైనా.. ఇష్యూ ఏదైనా మాజీ మంత్రి పెద్దిరెడ్డి జోరు మాత్రం ఒక రేంజ్ లో నడుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.