Begin typing your search above and press return to search.

పవన్ ని కదిలిస్తున్న ముద్రగడ !

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభం కదిలించ గలిగారు.

By:  Tupaki Desk   |   12 April 2024 8:41 AM GMT
పవన్ ని కదిలిస్తున్న ముద్రగడ !
X

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభం కదిలించ గలిగారు. ఆయన పేరు ప్రస్తావించకపోయినా అమలాపురం సభలో ముద్రగడ మీదనే ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. జగన్ ఏమి మేలు చేశారో ఆయన వెనక ఉన్న కాపు బీసీ నేతలు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.

తన సామాజిక వర్గం నేతలను ముందు పెట్టి జగన్ తిట్టిస్తున్నారు అని పవన్ వ్యక్తం చేసిన ఆగ్రహం కూడా ముద్రగడ గురించే అంటున్నారు. ముద్రగడ వైసీపీలో చేరిన తరువాత పవన్ మీద ఒక స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాజకీయాలు పవన్ కి ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పవన్ చంద్రబాబు మనిషిగా జనంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు.

కాపులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నపుడు ఆయనకు మద్దతుగా ఉంటూ పవన్ మౌనం వహించారు అని అంటున్నారు. కాపుల రిజర్వేషన్ గురించి తాను మాట్లాడితే అన్ని రకాలుగా తనను ఇబ్బంది పెట్టారు చంద్రబాబు అని అపుడు ఆయన పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ ఇదేమిటి అని ఒక్క మాట కూడా అనలేదని ఎత్తిపొడిచారు.

అంతే కాదు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని అక్కడ చిరునామాతో ఉండే పవన్ కి పిఠాపురం ఎమ్మెల్యే సీటు ఎందుకు అని సూటిగానే ముద్రగడ ప్రశ్నించారు. ఆయన షూటింగులు చేసుకోవడానికేనా ఎమ్మెల్యే పదవి అని సెటైర్లు వేశారు. ఇవన్నీ కూడా జనాలకు తాకాలనే ముద్రగడ అంటున్నారు. అంటే పవన్ కి పదవి ఆయనకు అలంకారం తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదు అని చెప్పడమే ముద్రగడ ఉద్దేశ్యం.

అంతే కాదు కాపులకు పవన్ ఏమీ చేయలేదని, ఏమీ చేయరని కూడా ముద్రగడ అంటున్నారు. మొత్తానికి చూస్తే తన గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని తన మీద నేరుగా అటాక్ చేయాలని అపుడు తాను అన్నింటికీ జవాబు చెబుతాను అని పవన్ కి ముద్రగడ సవాల్ చేశారు.

అయితే ఆయన అనుకున్నట్లుగా కాకపోయినా పవన్ అయితే ఇండైరెక్ట్ గానే అటాక్ చేశారు. గోదావరి జిల్లాలలో క్రాప్ హాలీ డేని డిక్లేర్ చేస్తే జగన్ వెంట ఉండే నాయకులు కానీ మద్దతు ఇస్తున్న వారు కానీ ఎందుకు ప్రశ్నించలేదు అని ఆయన నిలదీశారు. జగన్ వైపు ఉంటే వారు ఏపీ విద్రోహులే అని కూడా పవన్ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు.

మొత్తానికి చూస్తే ముద్రగడ మీద పవన్ నేరుగా విమర్శలు చేసే రోజు కూడా దగ్గరలో ఉందని అంటున్నారు. పిఠాపురంలో కాపుల అత్మీయ సమావేశలను ముద్రగడ నిర్వహిస్తూ పవన్ ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. దాంతో జవాబు చెప్పల్సిన అవసరం అయితే పవన్ కి ఏదో రోజు ఉంటుందని అంటున్నారు.

పవన్ కనుక ముద్రగడను డైరెక్ట్ గా అటాక్ చేస్తే అపుడు పిఠాపురం రాజకీయం రసకందాయంలో పడుతుందని అంటున్నారు. ముద్రగడకు కాపు పెద్దలలో ఆదరణ ఉంది. ఆయన చెప్పే మాటలను ఆ తరం వింటారు. అయితే పవన్ కి కాపు యువతలో ఆదరణ ఉంది. దీంతో పిఠాపురంలో ఇది వైసీపీకి ఎంత వరకూ మేలు చేస్తుంది, జనసేన విజయావకాశాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అన్నది చూడాలి ఉంది. ఏది ఏమైనా పిఠాపురంలో పవన్ ఓటమి వైసీపీ లక్ష్యం. దాని కోసం ప్రయోగించిన ఆయుధం ముద్రగడ. మరి ఆయన తనకిచ్చిన టాస్క్ ని ఎంతవరకూ సక్సెస్ చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.