Begin typing your search above and press return to search.

మోడీకి చేరో వైపు పవన్ లోకేష్

భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత సాహసోపేతంగా పాక్ మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో భారీ దాడి నిర్వహించారు.

By:  Tupaki Desk   |   7 May 2025 6:22 PM
మోడీకి చేరో వైపు పవన్ లోకేష్
X

భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత సాహసోపేతంగా పాక్ మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో భారీ దాడి నిర్వహించారు. దాని ఫలితం పాక్ కి దిమ్మదిరిగి బొమ్మ కనిపించింది. పాక్ గడ్డ మీద నిలిచి దాని కూసాలు కదల్చడం అంటే యాభై అంగుళాల చాతీ ఉన్న మోడీకే సాధ్యమని దేశమంతా అనుకునెలా ఈ దాడి సాగింది.

ఇక భారత ప్రధానికి ఇంటా బయటా అనూహ్య మద్దతు దక్కుతోంది. దేశంలోని ప్రత్యర్థి పార్టీలు అన్నీ కూడా ఉగ్రవాదుల మీద దాడులు చేసిన కేంద్రానికి పూర్తి దన్నుగా ఉంటామని ప్రకటించాయి. ఎన్డీయే మిత్రులు అయితే మోడీ అసమాన వీరుడు అని కీర్తించాయి.

అయితే అంతటా వేరు ఏపీ వేరు. ఏపీలో చూస్తే మోడీ నామస్మరణ గత ఏడాదిగా ఎక్కువగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మోడీ అంటే ఎంతో ఆరాధనాభావం ఉంది అన్నది అందరికీ తెలిసిందే. ఆయన 2014లో పార్టీ పెట్టినపుడు గుజరాత్ వెళ్ళి మరీ మోడీని కాబోయే ప్రధానిగా అభివర్ణిస్తూ మద్దతు ఇచ్చారు. ఆ మధ్యలో కొంత బీజేపీని విభేదించినా ఈ పదకొండేళ్ళలో అత్యధిక కాలం ఆయన బీజేపీని మోడీని ప్రశంసిస్తూనే ఉన్నారు.

తాజాగా పాక్ కి భారత్ గుణపాఠం చెప్పిన నేపధ్యంలో పవన్ కళ్యాణ్ తనదైన స్పందనను తెలియచేస్తూ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మోడీ వెంటనే భారత్ అన్నారు. భారతదేశం మోడీ నాయకత్వంలో తనను తాను రక్షించుకోగలదని కూడా అన్నారు. దేశం కోసం పాటు పడేవారు అంతా మద్దతుగా నిలవాలని సైన్యానికి దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారి మీద చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అలా పవన్ అందరి నేతల కంటే భిన్నంగా మోడీని కొనియాడుతూ ఈ ఘటన పట్ల తన స్పందనను వ్యక్తం చేశారు.

కట్ చేస్తే తరువాత వంతు నారా లోకేష్ ది. ఆయన ఇటీవల కాలంలో నరేంద్ర మోడీని తెగ పొగుడుతున్నారు. దానికి శుభారంభం విశాఖలో జరిగిన మీటింగులో అయింది. మోడీని నమో అని ఆ సభలో పదే పదే పొగిడిన లోకేష్ ఇటీవల అమరావతిలో జరిగిన సభలో ఏకంగా మిసైల్ అనేశారు. ఒక్క పాక్ కాదు కదా వందలాది పాక్ లు వచ్చినా మోడీ ముందు ఆటలు సాగవని చెబుతూ ఆయనను వేదిక మీద ఉండగానే ఉబ్బితబ్బిబ్బు చేశారు.

ఇపుడు పాక్ మీద భారత్ సక్సెస్ ఫుల్ గా ఎటాక్ చేసింది. దాంతో లోకేష్ కూడా పవన్ కి ఏ మాత్రం తీసిపోకుండా మోడీని కొనియాడారు. మిసైల్ అన్న విశేషణాన్ని జోడించి మరీ ట్వీట్ చేశారు. అంతే కాదు తిరుపతి జిల్లా సత్యవేడులో టీడీపీ నిర్వహించిన సమన్వయ సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ దేశ శత్రువులపై పోరాటంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

వంద పాకిస్థాన్‌లు వచ్చినా మన దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ అనే మిసైల్ ఉంది. భారతీయులను చంపిన వారిని వదిలిపెట్టకూడదనే లక్ష్యంతో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పారని లోకేష్ కొనియాడారు. మొత్తం మీద చూస్తే మోడీని పొగడడం విషయంలో అటు కూటమి నేతలు పోటీ పడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో బీజేపీకి బలం లేదు, కానీ కేంద్రంలో అధికారంలో ఉంది బలమైన ప్రధానిగా మోడీ ఉన్నారు.

దాంతో ఏపీలో ఏమి జరగాలన్నా మోడీ నైతిక మద్దతు అవసరం. అందుకే ఒక ప్రణాళికాబద్ధంగా కూటమి నేతలు అంతా మోడీ లైన్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. మోడీకి ఈ కీలక సమయంలో అంతా మద్దతుగా నిలవాల్సిందే అన్నది నిజం.