Begin typing your search above and press return to search.

పవన్ ఏడాది ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇదే !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైసీపీ నేతలు అప్పట్లో బీరాలు పోయారు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 2:30 AM
పవన్ ఏడాది ప్రొగ్రెస్ రిపోర్ట్  ఇదే !
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైసీపీ నేతలు అప్పట్లో బీరాలు పోయారు. కానీ 2024 ఎన్నికల్లో జనసేన కీ రోల్ ప్లే చేసింది. పవన్ తాను మాత్రమే కాకుండా మరో ఇరవై మంది దాకా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వచ్చేలా చేశారు. అలా 21 మంది ఎమ్మెల్యేలతో పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాను కూడా కూటమి ప్రభుత్వంలో దక్కించుకున్నారు.

ఇదిలా ఉంటే పవన్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎమ్మెల్యే అయి ఏడాది గడచింది. మరి పవన్ ఇచ్చిన హామీలు నెరవేర్చారా ఈ ఏడాదిలో ఆయన పనితీరు ఏమిటి, ఎమ్మెల్యేగా ఆయన చేసిన కార్యక్రమాలు ఏమిటి అన్న దాని మీద జనసేన ఒక నివేదిక రిలీజ్ చేసింది. అదే పవన్ కళ్యాణ్ ప్రొగ్రెస్ రిపోర్ట్ అని చెప్పాల్సి ఉంది.

పిఠాపురం పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శ్రీకారంతో పాటు, విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా ఈ ప్రొగ్రెస్ రిపోర్టులో వెల్లడించారు. పల్లె పండగ ద్వారా గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టిందని, రైతులకు అండగా మినీ గోకులాలు, వ్యవసాయ పరికరాలు అందాయని, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రచించడం జరిగిందని, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

కేవలం ఏడాది కాలంలోనే 308 కోట్ల రూపాయలకు పైగా నిధులను పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామ గ్రామాన సీసీ రోడ్లు, బీటీ రోడ్లతో ప్రజలకు రహదారి కష్టాలు తీరుతున్నాయని వివరించారు. . గొల్లప్రోలు మండల పరిధిలో రూ. 5.52 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులను పవన్ ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు వివిధ కార్పోరేట్ సంస్థల నుంచి వచ్చే సీఎస్ఆర్ నిధులను సమీకరించి పిఠాపురం అభివృద్ధికి జోడించారని పేర్కొన్నారు.

పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంతం కోతల నివారణకు జాతీయ స్థాయి నిపుణులను పిలిపించి కోతకుగల కారణాలు, నివారణా చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లిలో రూ. 2 కోట్ల వ్యయంతో పేద ప్రజలు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు వీలుగా టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నారని, మహిళా స్వయం సమృద్ధి లక్ష్యంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని 3,456 మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు రూ.8. 64 కోట్ల ఖర్చుతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. రూ.26 లక్షల వ్యవయంతో 2 వేల మంది చిన్న సన్నకారు రైతులకు టార్పాలిన్లు అందించారని వివరించింది.

అదే విధంగా రూ.4.78 కోట్లతో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.4.06 కోట్ల వ్యయంతో గొల్లప్రోలు మొగలి సూరీడు చెరువు సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నెగ్గిన ఏడాది కాలంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేంద్రంగా మలిచారని ప్రొగ్రెస్ నివేదిక పేర్కొంది.