ఆపరేషన్ సిందూర్..సెలబ్రిటీలకు పవన్ వార్నింగ్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 May 2025 9:19 AMపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మిస్సైల్ సర్జికల్ స్ట్రైక్స్ లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు చనిపోయారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంపై ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని, ఇది భారతీయులంతా గర్వించదగ్గ విషయమని పవన్ అన్నారు.
పాకిస్తాన్ ప్రజలకు, మిలటరీకి నష్టం వాటిల్లకుండా.. కేవలం ఉగ్రవాదుల స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేయడం గొప్ప విషయమని పవన్ అన్నారు. గాంధీ మార్గంలో నడిచినందుకే మన దేశానికి ఈ గతి పట్టిందని పవన్ ఆవేశపూరితంగా మాట్లాడారు. మనం శాంతి మంత్రం జపిస్తుంటే.. వేరే దేశం నుంచి వచ్చి మతం అడిగి మరీ హిందువులను చంపుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 1990 నుంచి కాశ్మీర్ పండిట్లను చంపడంతో ఉగ్రవాదుల అరాచకాలు పెరిగిపోయాయని, అంత్యక్రియలు చేసే చోట సైతం మారణహోమం చేసి హిందువులను చంపేశారని గుర్తు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పవన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దని హెచ్చరించారు. మీడియాతో పవన్ మాట్లాడుతున్న సందర్భంలో బయట కుక్కలు అరుస్తున్న శబ్దాలు ఆయనకు వినిపించాయి. దీంతో, ఆ కుక్కలు మొరుగుతున్న మాదిరిగానే సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు. ఒకవేళ, ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.