Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేల‌కు ప‌వ‌న్ చెప్పిన 'ర‌హ‌స్యం' ..!

జ‌న‌సేన పార్టీకి సంబంధించి గ‌త 2024 ఎన్నిక‌ల్లో 21 మంది ఎమ్మెల్యేలు విజ‌యం ద‌క్కించుకున్నారు.

By:  Garuda Media   |   25 May 2026 1:37 PM IST
ఆ ఎమ్మెల్యేల‌కు ప‌వ‌న్ చెప్పిన ర‌హ‌స్యం ..!
X

జ‌న‌సేన పార్టీకి సంబంధించి గ‌త 2024 ఎన్నిక‌ల్లో 21 మంది ఎమ్మెల్యేలు విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి.. గ్రాఫ్ బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం.. మాత్రం వివాదానికి దారితీసింది. వీరిలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే.. అర‌వ శ్రీధ‌ర్‌, పోల‌వ‌రం ఎమ్మెల్యే చిర్రి బాల‌రాజు ఉన్నారు. వాస్త‌వానికి మ‌రికొంద‌రిపైనా విమ‌ర్శ‌లు ఉన్నా.. వారిపై పెద్ద‌గా ఆరోప‌ణ‌లు లేవు. రాజ‌కీయంగా డ్యామేజీ చేసే ప‌రిస్థితి కూడా లేదు.

దీంతో గ‌త కొన్నాళ్లుగా వివాదానికి కేంద్రంగా మారిన అర‌వ శ్రీధ‌ర్‌, చిర్రి బాల‌రాజుల‌తో ప‌వ‌న్ భేటీ అయ్యా రు. వారికి త‌న స్ట‌యిల్‌లో క్లాస్ ఇచ్చారు. ఇదంతా మీడియాలో వ‌చ్చేసింది. అయితే.. వాస్త‌వానికి ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు క్లాస్ కంటే కూడా.. కీల‌క‌మైన ర‌హ‌స్యాన్ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ఇది వారికే కాకుండా.. పార్టీ కి.. ఇత‌ర నాయ‌కుల‌కు కూడా వ‌ర్తించే వ్య‌వ‌హారం కావ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇది పార్టీలో సంచ‌ల‌నంగా మారింది.

ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌తో చ‌ర్చించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎంత మంది పోటీకిరెడీ అయ్యారో.. జాబితాను తీసి బ‌య‌ట‌కు చూపించారు. ''వాస్త‌వానికి మ‌న‌కు ఆ టికెట్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఇదిగో జాబితా.. టీడీపీ, బీజేపీల నుంచి అనేక మంది నాయ‌కులు ఉన్నా రు. మ‌న‌కంటే.. మీకంటే కూడా వారంతా ఆర్థికంగా బ‌లంగా ఉన్నారు. కానీ.. మీ కోసం నేను గ‌ట్టిగా నిల‌బ‌డి ఈ టికెట్లు తీసుకున్నా.. మ‌న‌కు ఎస్సీ, ఎస్టీల్లో ఎంత బ‌లం ఉందో అంచ‌నా లేదు. అయినా.. మ‌న‌కు టికెట్లు ఇచ్చారు.`` అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ''ప్ర‌జ‌లు మ‌రీ ముఖ్యంగా వైసీపీకి కంచుకోట అనుకున్న స్థానాల్లో మ‌నం గెలిచాం. ఇప్పుడు వీటిని బ‌ద్నాం చేస్తే.. చూస్తూ ఊరుకోను. ఇది మీకంటే నాకు, పార్టీకి కూడా అత్యంత ముఖ్యం. ఒక్క‌సారి మీరు.. టికెట్లు ఇచ్చే స‌మ‌యంలో ఉన్న‌ పోటీని గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఆలోచించి.. నిర్ణ‌యం తీసుకోండి. ఎవ‌రైనా పోగొట్టు కోవ‌డం తేలిక‌. ఈ విష‌యంలో మీరు ఏం చేస్తారో ఆలోచించుకోండి.'' ఈ వ్యాఖ్యల‌తో చిర్రి బాల‌రాజు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అనంత‌రం వారిద్ద‌రు రియ‌లైజ్ అయ్యారు. మొత్తంగా గ‌తాన్ని గుర్తు చేసి.. వారిని రియ‌లైజ్ చేయ‌డం ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుతిమెత్త‌గా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిచ‌డం గ‌మ‌నార్హం.