జీతంపై మనసు మార్చుకున్న పవన్.. నెల వేతనాన్ని ఏం చేయనున్నారంటే..
ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా 32 మంది రాగా, మరో 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా అందజేయనున్నారు.
By: Tupaki Desk | 10 May 2025 11:38 AM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. అధికారంలోకి రాకముందే తన సంపాదన నుంచి పేదలు, కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసిన పవన్.. ఇప్పుడు తన నెల జీతాన్ని సొంత నియోజకవర్గం పిఠాపురంలోని అనాథ పిల్లలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తొలుత జీతం తీసుకోకూడదని భావించిన పవన్ తాజాగా మనసు మార్చుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న జీతం తనను గెలిపించిన ప్రాంతంలో పేదలకు పంచాలని భావించారు. మొత్తం 42 మంది అనాథ పిల్లలను గుర్తించి మొత్తం రూ.2.10 లక్షల నగదు పంపిణీ చేశారు. ఇకపై నెలనెలా రూ.5 వేల చొప్పున అనాథలకు పంపిణీ చేయనున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వినూత్న పంథాను మరోసారి చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన పవన్ ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇదే సమయంలో తన నెల జీతాన్ని కూడా ఆ నియోజకవర్గంలోనే వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నారు. తన వేతనం మొత్తాన్ని తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల భవిష్యత్తు, చదువుకు ఖర్చు చేయనున్నారు. శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎంపిక చేసిన 42 మందికి నగదు సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా 32 మంది రాగా, మరో 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా అందజేయనున్నారు.
నెలనెలా పిల్లల ఇంటి వద్దే వారి సంరక్షకులకు రూ.5 వేల చొప్పున అందజేయనున్నట్లు పవన్ ప్రకటించారు. ప్రభుత్వం, పదవి ఉన్నంతవరకు వేతనంగా తీసుకునే మొత్తాన్ని అనాథ పిల్లలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. పిఠాపురం ప్రజలు తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని తిరిగి వారికే ఇవ్వాలని భావించానని వెల్లడించారు. ఇక తన విజయం కోసం ప్రార్థించి వేగులమ్మ అమ్మవారికి మొక్కు చెల్లించిన వృద్ధురాలు పోతుల పేరంటాలును తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్న పవన్, ఆమెతో కలిసి భోజనం చేశారు.
96 ఏళ్ల పోతుల పేరంటాలు పవన్ ఎమ్మెల్యేగా గెలవాలంటూ అమ్మవారిని మొక్కుకున్నారు. ఆయన గెలిస్తే గరగ చేయిస్తానని ప్రార్థించారు. పోతుల పేరంటాలు మొక్కు ఫలించి పవన్ ఘన విజయం సాధించారు. దీంతో తన నెల పింఛను నుంచి రూ.27 వేలు పొదుపు చేసి కొద్ది రోజుల క్రితం మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ తో కలిసి భోజనం చేయాలని ఉందని చెప్పారు. దీంతో ఆమెను తన క్యాంపు కార్యాలయానికి తీసుకురమ్మని అనుచరులను పురమాయించారు పవన్. శుక్రవారం ఆమెతోనే కలిసి భోజనం చేయడంతోపాటు వృద్ధురాలికి రూ.లక్ష నగదు సాయం చేశారు. చీర పెట్టి పాదాభివందనం చేశారు. తిరుగు ప్రయాణంలో కారు వరకు వెళ్లి వీడ్కోలు పలికారు.